‘కొవిషీల్డ్‌’ టీకాకు నేపాల్‌ అనుమతి

భారత్‌లో తయారవుతోన్న కొవిషీల్డ్‌ టీకాకు పొరుగు దేశం నేపాల్‌ కూడా అనుమతి ఇచ్చింది.

Published : 15 Jan 2021 23:58 IST

కాఠ్‌మాండూ: భారత్‌లో తయారవుతోన్న కొవిషీల్డ్‌ టీకాకు పొరుగు దేశం నేపాల్‌ కూడా అనుమతి ఇచ్చింది. ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాను నేపాల్‌లో అత్యవసర వినియోగం కింద అమనుతి ఇస్తున్నట్లు అక్కడి డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. దీంతో మరికొన్ని రోజుల్లోనే కొవిషీల్డ్‌ టీకాలను భారత్‌ నుంచి సేకరించే అవకాశం ఉంది.

భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేస్తోన్న కొవిషీల్డ్‌ టీకాను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 2కోట్ల డోసులను పొరుగు దేశాలకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, భారత్‌లో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలైన సీరం ఇన్‌స్టిట్యూట్‌తో పాటు భారత్‌ బయోటెక్‌ సంస్థల నుంచి వ్యాక్సిన్‌ను తీసుకొని నేపాల్, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌, మారిషస్‌ వంటి ప్రాంతాలకు సరఫరా చేసే అవకాశాలున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పొరుగుదేశాలకు సరఫరా చేసిన అనంతరం, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, యూరప్‌ దేశాలకు కూడా వ్యాక్సిన్‌ సరఫరా చేస్తుందని నివేదికల సారాంశం. ఇప్పటికే చైనా వ్యాక్సిన్‌ ప్రయోగాలను చేపడుతోన్న బ్రెజిల్‌ కూడా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

అయితే, దేశంలో భారీ ఎత్తున టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోన్న నేపథ్యంలో విదేశాలకు ఏ మేరకు సరఫరా చేస్తామనే విషయంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇదిలాఉంటే, నేపాల్‌లో ఇప్పటివరకు 2,66,816 పాజిటివ్‌ కేసులు బయటపడగా, 1948 కొవిడ్‌ మరణాలు చోటుచేసుకున్నాయి.

ఇవీ చదవండి..
వ్యాక్సినేషన్‌.. ఈ రూల్స్‌ మర్చిపోవద్దు
చైనాకు హెచ్చరిక: మా సహనాన్ని పరీక్షించొద్దు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని