Sameer Wankhede: డ్రగ్స్‌ వ్యాపారంలో సమీర్‌ వాంఖడే మరదలు..?

మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ) ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ తన విమర్శలు, ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

Published : 08 Nov 2021 11:18 IST

మరోసారి సంచలన ఆరోపణలు చేసిన నవాబ్‌ మాలిక్

ముంబయి: మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సీబీ) ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ తన విమర్శలు, ఆరోపణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నౌకలో ఏర్పాటుచేసిన పార్టీ పేరుతో ఆర్యన్‌ ఖాన్‌ను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నం జరిగిందని, ఇందుకు సూత్రధారి సమీర్‌ వాంఖడేనే అని నిన్న సంచలన ఆరోపణలు చేసిన మాలిక్‌.. తాజాగా ఆయనపై మరిన్ని ఆరోపణలు చేశారు. వాంఖడే మరదలు హర్షదా దీనానత్‌ రేడ్కర్‌కు డ్రగ్స్‌ వ్యాపారాలతో సంబంధముందన్న ఆయన.. దీనిపై ఎన్‌సీబీ అధికారి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ చట్టం కింద 2008లో నమోదైన కేసులో వాంఖడే సతీమణి క్రాంతీ రేడ్కర్‌ సోదరి హర్షదా పేరు కూడా ఉంది. ఈ కేసును ఆధారంగా చేసుకుని నవాబ్ మాలిక్‌.. సమీర్‌పై ఆరోపణలు చేశారు. ‘‘సమీర్‌ దావూద్‌ వాంఖడే.. మీ మరదలు హర్షదా దీనానత్‌ రేడ్కర్‌ డ్రగ్స్‌ వ్యాపారం చేశారా? దీనికి మీరు తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆమె కేసు పుణె కోర్టులో పెండింగ్‌లో ఉంది’’ అని మాలిక్‌ ట్వీట్ చేశారు.

అయితే ఈ ఆరోపణలను సమీర్‌ వాంఖడే తోసిపుచ్చారు. 2008లో తాను ఇంకా సర్వీసులోకే రాలేదని, అంతేగాక, క్రాంతి రేడ్కర్‌ను తాను 2017లో వివాహం చేసుకున్నానని తెలిపారు. అందువల్ల మంత్రి ఆరోపిస్తోన్న కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. నవాబ్‌ మాలిక్‌పై వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్‌ బాంబే హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. తమ మత విశ్వాసాలను అవమానిస్తూ మాలిక్‌ ఆరోపణలు చేస్తున్నారని, దీని వల్ల తమ కుటుంబ గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లిందని ధ్యాన్‌దేవ్‌ పేర్కొన్నారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని