Life Saver: 12వేల ప్రాణాలను రక్షించిన టీకాలు!

వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌లో టీకాల వల్ల ఇప్పటివరకు 12వేల మరణాలను నిర్మూలించగలిగినట్లు అక్కడి ప్రజారోగ్య విభాగం వెల్లడించింది.

Published : 15 May 2021 01:15 IST

పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌(పీహెచ్‌ఈ) అధ్యయనం వెల్లడి

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌లో టీకాల వల్ల ఇప్పటివరకు 12వేల మరణాలను నిర్మూలించగలిగినట్లు అక్కడి ప్రజారోగ్య విభాగం వెల్లడించింది. అంతేకాకుండా మరో 30వేలకుపైగా వృద్ధులు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి బారినపడకుండా వ్యాక్సిన్‌లు అడ్డుకున్నాయని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ (పీహెచ్‌ఈ) వెల్లడించింది.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీని బ్రిటన్‌ అత్యంత వేగంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఐదున్నర కోట్ల డోసులను అందించగా మొత్తం జనాభాలో దాదాపు 53శాతం తొలి డోసు తీసుకున్నారు. 28శాతం రెండు డోసులను పొందారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల ఫలితాలను విశ్లేషించిన అక్కడి ప్రజారోగ్య విభాగం(పీహెచ్‌ఈ), ఏప్రిల్‌ చివరి నాటికి 60ఏళ్లకు పైబడిన వారిలో 11,700 మరణాలను నిర్మూలించగలిగినట్లు వెల్లడించింది. అంతేకాకుండా 65ఏళ్లు పైబడిన మరో 33వేల మందిని ఆసుపత్రి చేరికల నుంచి నివారించామని పేర్కొంది. ఇవి వ్యాక్సిన్ల ప్రత్యక్ష ప్రభావాల వల్ల అంచనా వేసినవి మాత్రమేనని పీహెచ్‌ఈ తెలిపింది. వీటికి అదనంగా వ్యాక్సినేషన్‌తో వైరస్‌ వ్యాప్తిని నిర్మూలించడం వల్ల మరణాలు, ఆసుపత్రి చేరికలను భారీ స్థాయిలో నిరోధిస్తున్నామనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఇంగ్లాండ్‌ ప్రజారోగ్య విభాగం స్పష్టం చేసింది. ఇంగ్లాండ్‌ సమాచారం విశ్లేషణలో ఈ ఫలితాలు కనిపించాయని.. స్కాట్‌లాండ్‌, వేల్స్‌లతో కలిపితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

‘కరోనా వ్యాక్సిన్‌లు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను కాపాడాయి. ప్రజలు వైరస్‌ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురికాకుండా నివారించడంలో వ్యాక్సిన్ల ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వీరినే కాకుండా ఆసుపత్రులను, ఆరోగ్య వ్యవస్థలను వ్యాక్సిన్లు రక్షిస్తున్నాయి’ అని ఇంగ్లాండ్‌ ప్రజారోగ్య విభాగంలోని వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు నేతృత్వం వహిస్తున్న ఆరోగ్య నిపుణులు మేరీ రామ్సే పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, కరోనా వైరస్‌ విజృంభణ ధాటికి వణికిపోయిన బ్రిటన్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఆంక్షలను బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం సడలిస్తోంది. ఇప్పటివరకు 44లక్షల మందిలో వైరస్‌ బయటపడగా.. లక్షా 27 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను అత్యంత వేగంగా చేపడుతోంది. అక్కడి జనాభాలో దాదాపు మూడోవంతు మంది వ్యాక్సిన్‌ అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని