Jammu and Kashmir: సరిహద్దుల్లో డ్రోన్‌ కూల్చివేత.. 5కిలోల పేలుడు పదార్థాలు లభ్యం

జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల సంచారం మరోసారి కలకలం రేపింది. భారత సరిహద్దుకు సమీపంలో ఓ డ్రోన్‌ను గుర్తించిన పోలీసులు కాల్పులు జరిపారు. అందులో 5 కిలోల వరకు పేలుడు పదార్థాలు

Updated : 23 Jul 2021 16:48 IST

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల సంచారం మరోసారి కలకలం రేపింది. భారత సరిహద్దుకు సమీపంలో ఓ డ్రోన్‌ను గుర్తించిన పోలీసులు కాల్పులు జరిపారు. అందులో 5 కిలోల వరకు పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

కనచక్‌ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గురువారం రాత్రి ఓ డ్రోన్‌ సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని యాంటీ-డ్రోన్‌ స్ట్రాటజీ ద్వారా దానిపై కాల్పులు జరిపారు. ఈ డ్రోన్‌ దేశ సరిహద్దును దాటుకుని భారత భూభాగం వైపు దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల లోపలకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీన్ని హెక్సాకాప్టర్‌గా గుర్తించారు.

కూల్చివేసిన అనంతరం డ్రోన్‌ను తనిఖీ చేయగా.. అందులో 5 కిలోల వరకు పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. వీటిని అత్యంత శక్తిమంతమైన ఐఈడీ బాంబుల తయారీకి ఉపయోగిస్తారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

గత నెల జమ్మూలోని వైమానిక స్థావరంపై డ్రోన్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత సరిహద్దుల్లో పలుమార్లు డ్రోన్ల కదలికలను అధికారులు గుర్తించారు. దీంతో జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. యాంటీ- డ్రోన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు