పాక్‌ భూభాగంలో ఇరాన్‌ సర్జికల్‌ స్ట్రైక్‌!

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై ఇరాన్‌ మెరుపు దాడులు (సర్జికల్‌ స్ట్రైక్‌) చేసింది.

Published : 05 Feb 2021 11:27 IST

ఉగ్రవాద శిబిరంపై దాడి   
ఇద్దరు సైనికులకు విముక్తి

దిల్లీ: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై ఇరాన్‌ మెరుపు దాడులు (సర్జికల్‌ స్ట్రైక్‌) చేసింది. ఇరాన్‌ సైన్యంలోని సుశిక్షిత రివల్యూషనరీ గార్డ్స్‌ దళం (ఐఆర్‌జీసీ) వీటిని చేపట్టింది. రెండున్నరేళ్లుగా బలూచిస్థాన్‌ ఉగ్రవాదుల చెరలో ఉన్న తమ సైనికులిద్దరిని విడిపించుకెళ్లింది. నిఘా సమాచారం ఆధారంగా మంగళవారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు ఐఆర్‌జీసీ తాజాగా వెల్లడించింది. 
బలూచిస్థాన్‌లోని జైష్‌ ఉల్‌ అదల్‌ అనే ఉగ్రవాద ముఠా 2018లో 12 మంది ఇరాన్‌ సైనికులను అపహరించింది. వారిని రెండు దేశాల సరిహద్దుల్లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో మెర్కావా నగరానికి తరలించింది. 

ఈ ముఠా కొన్నేళ్లుగా ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ ఉద్యమాన్ని నడుపుతోంది. ఇరాన్‌ సైనికులను విడిపించడానికి పాక్, ఇరాన్‌ ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. 2018 నవంబర్‌లో ఐదుగురు బందీలకు విముక్తి లభించింది. మరో నలుగురిని 2019లో పాక్‌ సైన్యం విడిపించింది. తాజాగా మెరుపు దాడుల్లో ఇద్దరు బందీలకు విముక్తి లభించింది. జైష్‌ ఉల్‌ అదల్‌.. ఇరాన్‌లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడింది. 2019 ఫిబ్రవరిలో పదుల సంఖ్యలో భద్రతా సిబ్బందిని చంపేసింది. ఇరాన్‌ సరిహద్దుల్లో భద్రతా సిబ్బందిని అపహరించి, పాక్‌కు తరలించుకెళ్లిన ఉదంతాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ తీరుపై ఇరాన్‌ సైన్యం ఆందోళన వ్యక్తంచేసింది. సరిహద్దు భద్రతపై పొరుగు దేశం తీరు చాలా ఉదాసీనంగా ఉందని ఆక్షేపించింది. 2016లో భారత సైన్యంలోని పారా కమాండోలు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి, అనేక మంది ముష్కరులను హతమార్చిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి...

ఇది బైడెన్‌ ప్రభుత్వం.. ఇకఅన్నీ రిపేర్‌ చేస్తాం!

టాలీవుడ్‌లో బీటౌన్‌ లేడీస్‌ ‘కీ’ రోల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని