ఈ ఏడాది చొరబాట్లు తగ్గాయి: సైనిక కమాండర్‌

జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు వెంబడి నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని శ్రీనగర్‌ బేస్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బీఎస్‌ రాజు తెలిపారు. ఈ ఏడాది భద్రతా దళాలు భారీ స్థాయిలో ఉగ్ర చొరబాట్లను అడ్డుకోగలిగాయని ఆయన తెలిపారు.

Published : 10 Oct 2020 19:48 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు వెంబడి నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని శ్రీనగర్‌ బేస్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బీఎస్‌ రాజు తెలిపారు. ఈ ఏడాది భద్రతా దళాలు భారీ స్థాయిలో ఉగ్ర చొరబాట్లను అడ్డుకోగలిగాయని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన జమ్మూకశ్మీర్‌లోని లైట్‌ ఇంఫాట్రీ రెజిమెంటల్‌ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న సైనికుల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన 301 మంది యువకులు పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి అదుపులోనే ఉంది. కొన్నిసార్లు పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ద్వారా చొరబాట్లని ప్రోత్సహిస్తుంది. అలాంటి ప్రాంతాల్లోనూ పరిస్థితి నియంత్రణలోనే ఉంది. ఈ ఏడాది భారీ స్థాయిలో చొరబాట్లను అడ్డుకోగలిగాం. గతేడాది 130 ఉగ్రవాద చొరబాట్లకు సంబంధించిన ఘటనలు జరిగాయి. ఆ సంఖ్య ఈ ఏడాది 30కి పడిపోయింది. ఈ అక్రమ చొరబాట్ల సంఖ్య తగ్గడంతో కశ్మీర్‌ వ్యాలీలో పరిస్థితులు కొంతమేర కుదుటపడ్డాయి’ అని తెలిపారు. 

ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్ల గురించి మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదులకు వ్యతిరేక ఆపరేషన్లు సైతం కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఓ విదేశీ ఉగ్రవాదితో పాటు, స్థానిక ఉగ్రవాదిని కూడా భద్రతాదళాలు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాయి. విదేశీ ఉగ్రవాదులను హతం చేసిన చోట ఆయా ప్రాంతాలు ప్రశాంతంగా ఉంటున్నాయి. గత మూడు నెలలుగా పుల్వామా, షోపియాన్‌ ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఆపరేషన్లు నిర్వహించడం కారణంగా ప్రస్తుతం ఆ ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయి.  ఈ మధ్య కాలంలో కొందరు ఉగ్రవాదులుగా హింసా మార్గాన్ని వదిలిపెట్టి లొంగిపోతున్నారు. అది ఎంతో మంచి విషయం’అని రాజు పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ గురించి ప్రస్తావించగా.. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతా దళాల తరపున సహాయ సహకారాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. పీఓకేలో క్షిపణులను ఏర్పాటు చేసేందుకు పాక్‌కు చైనా సహాయం చేస్తోందని వస్తున్న వార్తల గురించి ప్రశ్నించగా.. అలాంటి సూచనలేవీ లేవని కమాండర్‌ అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని