Corona: మరోసారి 20వేల పైన కొత్త కేసులు.. మరణాల్లో సగం కేరళలోనే..

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. గత రెండు రోజులుగా 20వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా

Updated : 30 Sep 2021 11:37 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. గత రెండు రోజులుగా 20వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.06లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 23,529 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు కేసుల (18,870)తో పోలిస్తే 24శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. అయితే, ఇదే సమయంలో మరణాలు కాస్త తగ్గడం ఊరటనిస్తోంది. అంతక్రితం రోజు 378 మంది కరోనాతో మరణించగా.. నిన్న ఆ సంఖ్య 311గా ఉంది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.37కోట్లు దాటగా.. ఇప్పటి వరకు 4,48,062 మందిని వైరస్‌ పొట్టనబెట్టుకుంది. కొత్తగా నమోదైన మరణాల్లో సగం ఒక్క కేరళలోనే వెలుగుచూడటం గమనార్హం. నిన్న ఆ రాష్ట్రంలో 12,161 కొత్త కేసులు నమోదవ్వగా.. 155 మంది కరోనాతో మరణించారు. 

ఇదిలా ఉండగా.. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటుండటం సానుకూలాంశం. నిన్న మరో 28,718 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 3.30కోట్ల మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 97.85శాతానికి పెరిగింది. ఇక, కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య 3 లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,77,020 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.82శాతంగా ఉంది. 

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం మరో 65,34,306 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 88.34కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని