India Corona: కొనసాగుతోన్న ఉగ్రరూపం.. 2 లక్షలకు చేరువైన కొత్త కేసులు..!

దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా లక్ష పైనే నమోదవుతోన్న కొత్త కేసులు తాజాగా రెండు లక్షలకు చేరువయ్యాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 5వేలకు సమీపించాయి.

Updated : 12 Jan 2022 14:21 IST

400కు పైగా మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా లక్షపైనే నమోదవుతోన్న కొత్త కేసులు తాజాగా రెండు లక్షలకు చేరువయ్యాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 5వేలకు సమీపించాయి. నిన్న 400కు పైగా కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.

11 శాతానికి పాజిటివిటీ రేటు..

మంగళవారం 17 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 1,94,720 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాజిటివిటీ రేటు 11.05 శాతానికి చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కు పెరిగింది. నిన్న 407 మందిలో కొత్తగా ఈ వేరియంట్‌ను గుర్తించారు. ఈ కేసుల పరంగా మహారాష్ట్ర, రాజస్థాన్, దిల్లీ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే 1,805 మంది కొత్త వేరియంట్ బారి నుంచి కోలుకున్నారు. మరోపక్క అన్ని రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో కరోనా ఉద్ధృతి పెరుగుతుండటంతో.. మకర సంక్రాంతి రోజు హరిద్వార్‌, రిషికేశ్‌లోని గంగానది ఘాట్‌ల వద్ద పవిత్ర స్నానాలను నిషేధించారు. ఒడిశా సర్కారు కూడా మకర సంక్రాంతి సహా వరుసగా మూడు రోజులపాటు సముద్ర, నదీ తీరాల వద్ద, చెరువుల్లో పుణ్య స్నానాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దిల్లీ ఇప్పటికే రెస్టారెంట్లు, బార్లపై నిషేధం విధించగా.. ప్రైవేటు కార్యాలయాలనూ పూర్తిగా మూసివేయాలని మంగళవారం ఆదేశించింది.

24 గంటల్లో 442 మరణాలు..

కరోనా ఉద్ధృతి కారణంగా ప్రస్తుతం క్రియాశీల కేసులు 9 లక్షలు దాటేశాయి. ఆ రేటు 2.65 శాతానికి పెరిగిపోయింది. అయితే రికవరీలు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటనిస్తోంది. నిన్న 60,405 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 3.6 కోట్లకు చేరగా.. 3.46 కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 96.01 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో 442 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు రోజుకంటే మరణాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకూ 4.84 లక్షల మరణాలు సంభవించాయి. 

దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. నిన్న 85,26,240 మంది టీకా వేయించుకున్నారు. మొత్తం డోసుల పంపిణీ 153 కోట్లను దాటింది. 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి 2.8 కోట్లకు పైగా డోసులు అందాయి. 18,85,715 ప్రికాషనరీ డోసుల పంపిణీ జరిగిందని కేంద్రం వెల్లడించింది. 

రేపు ముఖ్యమంత్రులతో మోదీ భేటీ

దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నందున... వైరస్‌ కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న ఆంక్షలు, వైద్య సన్నద్ధత, టీకా కార్యక్రమం అమలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై సమీక్షించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని