మంత్రి ఇంటికి వెళ్లి టీకా వేసిన అధికారిపై వేటు!

గత నెలలో కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్‌ ఇంటికే వెళ్లి టీకా వేసిన అధికారిపై వేటు పడింది. కొవిడ్‌ టీకా పంపిణీ నిబంధనల్ని .....

Updated : 02 Apr 2021 18:47 IST

రెండో డోసు ఆస్పత్రికెళ్లి వేయించుకున్న మంత్రి

బెంగళూరు: గత నెలలో కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్‌ ఇంటికే వెళ్లి టీకా వేసిన అధికారిపై వేటు పడింది. కొవిడ్‌ టీకా పంపిణీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఆయన్ను విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మార్చి 2న హవేరి జిల్లా హిరెకెరూర్‌ తాలుకా వైద్యాధికారి డాక్టర్‌ జెడర్‌ ముఖందర్‌ నేరుగా మంత్రి ఇంటికే వెళ్లి బీసీ పాటిల్‌, ఆయన సతీమణికి టీకా వేయించారు. ఆ ఫొటోలను మంత్రి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయడంతో అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. శిక్షణలో పదే పదే సూచించినప్పటికీ ఇంటికి వెళ్లి టీకా వేయడంపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ ఘటనపై వైద్యశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో పాటు ఆ వైద్యాధికారిపై వేటు వేశారు. ఈ మేరకు మార్చి 26న ఆరోగ్యశాఖ కమిషనర్‌ డాక్టర్‌ కేవీ త్రిలోక్‌ చంద్ర ఉత్తర్వులు జారీచేశారు. విచారణ పూర్తయ్యే వరకూ తమ అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు.  టీకా పంపిణీ నిబంధనల ఉల్లంఘనపై కర్ణాటక వైద్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ రావు కూడా అసంతృప్తి వ్యక్తంచేశారు.

తాజాగా, గత నెలలో తొలి డోసును ఇంటి వద్దే వేయించుకున్న మంత్రి తనపై విమర్శలు రావడంతో రెండో డోసును ఆస్పత్రికే వెళ్లి వేయించుకున్నారు. శుక్రవారం  హిరెకెరె ప్రభుత్వ ఆస్పత్రిలో టీకా రెండో డోసు వేయించుకున్న ఫొటోలను ఆయన పోస్ట్‌ చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని