పాక్‌లో భారత్ అధికారుల ఆచూకీ లభ్యం 

సోమవారం ఉదయం పాకిస్థాన్‌లో అదృశ్యమైన ఇద్దరు భారత అధికారులు పాకిస్థాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటలిజెన్స్‌ అదుపులో ఉన్నట్లు సమాచారం...

Published : 15 Jun 2020 20:00 IST

దిల్లీ: సోమవారం ఉదయం పాకిస్థాన్‌లో అదృశ్యమైన ఇద్దరు భారత అధికారులు పాకిస్థాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) అదుపులో ఉన్నట్లు సమాచారం. వీరివురిని త్వరలోనే  తిరిగి భారత్‌కు అప్పగించనున్నట్లు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లోని భారత్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు సోమవారం కనిపించకుండా పోయారు.

హైకమిషన్ కార్యాలయం నుంచి బయల్దేరిన ఇద్దరు అధికారులు వారి గమ్యస్థానాలకు చేరకపోవడంతో అదృశ్యమైనట్లు గుర్తించారు. దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల శాఖకు సమాచారం అందడంతో అప్రమత్తమైంది. దీనిపై భారత విదేశాంగ శాఖ, భారత్ హైకమిషన్‌ కార్యాలయ వర్గాలు సంప్రదింపులు జరిపాయి. కానీ వారు దీని గురించి విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే హిట్ అండ్ రన్‌ కేసులో ఇద్దరు భారత అధికారులను అరెస్టు చేసినట్లు పాక్‌ మీడియాలో సోమవారం వార్తలు వెలువడ్డాయి. 

ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ భారత్‌లోని పాక్‌ రాయబారి సయ్యద్‌ హైదర్‌ షాకు హోం మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. ఇద్దరు భారత అధికారుల రక్షణ పాకిస్థాన్‌ బాధ్యతని, వారిని విచారణ పేరుతో ఎలాంటి వేధింపులకు గురిచేయకూడదని తెలిపింది. తక్షణం పూర్తి భద్రతతో వారిని భారత్ హైకమిషన్‌ కార్యాలయానికి పంపాలని కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తర్వాత కొద్ది సేపటికే ఇరువురు అధికారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు ఇస్లామాబాద్‌లోని భారత్ హైకమిషన్ కార్యాలయానికి సమాచారం అందినట్లు తెలిపారు. దీంతో భారత్ అధికారులు అక్కడికి చేరుకుని వారిని తమతో తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని