సరైన సమయంలో ఆదుకున్నారు..మోదీజీ..

తమ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో  భారత ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Published : 10 Apr 2020 01:27 IST

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సరఫరాపై బ్రెజిల్ అధ్యక్షుడు

దిల్లీ: తమ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో  భారత ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్ ప్రజలను సరైన సమయంలో ఆదుకున్నారని వెల్లడించారు. మలేరియాను నయం చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సరఫరాకు భారత్ అంగీకరించడమే అందుకు కారణం. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కొవిడ్ 19 చికిత్సలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు ప్రాథమికంగా నిర్ధారించడంతో ఒక్కసారిగా ఆ మందులకు డిమాండ్‌ పెరిగిపోయింది. 

హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరాపై బొల్సొనారో మాట్లాడుతూ..‘మనకు  మరింత ఆనందాన్నిచ్చే శుభవార్త. భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చల కారణంగా హైడ్రాక్సీక్లోరోక్విన్ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు శనివారానికి మనదేశానికి చేరుకుంటాయి. దాంతో మనం కొవిడ్‌ 19, మలేరియా, ఆర్థరైటిస్ వంటి ఇతర వ్యాధులను నయం చేసుకోగలం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సరైన సమయంలో సహకరించిన భారత ప్రధాని, ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెప్తున్నాను’ అని వెల్లడించారు. భారత ఇతిహాసమైన రామాయణంలో లక్ష్మణుడి కోసం హనుమంతుడు సంజీవనిని తెచ్చిన ఘట్టాన్ని ఉద్దేశించి కొద్దిరోజల క్రితం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కోసం అభ్యర్థిస్తూ బొల్సొనారో లేఖ రాశారు. అలాగే దానిపై మోదీతో ఫోన్‌లో కూడా చర్చించారు. 
 ఇదిలా ఉండగా, వైరస్ కట్టడికి  అధ్యక్షుడు తీసుకుంటున్న చర్యలపై ఆ దేశంలోని కొన్నివర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. అది కేవలం ఫ్లూ అంటూ అధ్యక్షుడు కరోనా తీవ్రతను కొట్టిపారేయడం వారి ఆగ్రహానికి కారణమైంది.  ఆ దేశంలో 15వేల మందికి పైగా కరోనా వైరస్‌ బారిన పడగా, 127 మంది మరణించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని