కుక్కలు, పిల్లులు తినడంపై నిషేధం

ఏది పడితే అది తింటారు. మీ వల్ల ఇవాళ ప్రపంచం అంతా ఇబ్బంది పడుతోంది. అయినా ఆ తిండేంటిరా బాబూ’’ అంటూ కొవిడ్‌-19 విజృంభిస్తున్న వేళ చైనా ఆహారపు అలవాట్లు.....

Published : 03 Apr 2020 00:51 IST

నిర్ణయం తీసుకున్న తొలి చైనా నగరంగా షెన్‌జెన్‌

షెన్‌జెన్‌ (చైనా): ‘‘ఏది పడితే అది తింటారు. మీ వల్ల ఇవాళ ప్రపంచం అంతా ఇబ్బంది పడుతోంది. అయినా ఆ తిండేంటిరా బాబూ’’ ఇదీ.. కొవిడ్‌-19 విజృంభిస్తున్న వేళ చైనా ఆహారపు అలవాట్లు గురించి వినిపిస్తున్న కామెంట్‌. కరోనా మహమ్మారి వెలుగుచూసిందీ ఎక్కువగా మాంసం విక్రయించే వుహాన్‌ నగరంలోనే. దీంతో కొన్నాళ్లు ఆ దుకాణాలను మూసివేసినా మళ్లీ వాటి విక్రయాలు ఊపందుకున్నాయి. అయితే, అదే చైనాలోని షెన్‌జెన్‌ నగరం మాత్రం కళ్లు తెరిచింది. కుక్కలు, పిల్లులు విక్రయాలతో పాటు తినడంపై నిషేధం విధించింది.

మే 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని షెన్‌జెన్‌ సిటీ ప్రభుత్వం పేర్కొంది. కుక్కలూ పిల్లులూ మిగిలిన జంతువులతో పోలిస్తే మనిషితో మంచి సంబంధాలు కలిగి ఉంటాయిని, అందుకే వీటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే చైనా క్రూర మృగాల మాంసం విక్రయాలపై ఫిబ్రవరిలో నిషేధం విధించగా.. దాన్ని కుక్క, పిల్లులకు కూడా షెన్‌జెన్‌ నగరం వర్తింపజేసింది.

షెన్‌జెన్‌ తీసుకున్న నిర్ణయంపై జంతు సంరక్షణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కరోనాతో షెన్‌జెన్‌ సిటీ మేల్కొందని, మరో ఉపద్రవం ముంచుకురాకుండా ముందు జాగ్రత్త తీసుకుందని అంతర్జాతీయ హ్యూమన్‌ సొసైటీ (హెచ్‌ఎస్‌ఐ)కి చెందిన వన్య ప్రాణి విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ థెరిసా ఎం.టెల్కీ పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఇతర ప్రభుత్వాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆసియా మొత్తమ్మీద ఏటా 3 కోట్ల శునకాలను మాంసం కోసం వధిస్తారని హెచ్‌ఎస్‌ఐ తెలిపింది. హాంకాంగ్‌, తైవాన్‌లో వీటి వినియోగం ఎక్కువ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని