కొవిడ్‌ ఎఫెక్ట్‌: చైనాలో కరెన్సీ నోట్ల నిల్వ!

కొవిడ్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చైనా కరెన్సీ నోట్లపైన దృష్టి సారించింది. కరెన్సీ నోట్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. ప్రభావిత ప్రాంతాల్లో వాటిని తాత్కాలికంగా నిల్వ చేయడం ప్రారంభించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.

Published : 16 Feb 2020 00:35 IST

బీజింగ్‌: కొవిడ్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చైనా కరెన్సీ నోట్లపైన దృష్టి సారించింది. కరెన్సీ నోట్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో.. ప్రభావిత ప్రాంతాల్లో వాటిని తాత్కాలికంగా నిల్వ చేయడం ప్రారంభించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. చైనా పీపుల్స్‌ బ్యాంక్‌ వైస్‌ గవర్నర్‌ ఫ్యాన్‌ యెఫై మాట్లాడుతూ.. ఇప్పటికే హుబెయ్‌ ప్రావిన్స్‌కు 4 బిలియన్‌ యువాన్ల కొత్త నోట్లను సరఫరా చేసినట్లు తెలిపారు. నోట్ల ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నోట్లను ప్రభుత్వ బ్యాంకుల్లో తాత్కాలికంగా నిల్వ చేయమని సెంట్రల్‌బ్యాంకు సూచించినట్లు చెప్పారు. ఆస్పత్రులు, తడి మార్కెట్ల నుంచి వచ్చే నోట్లను భద్రపరచి.. వాటిని యూవీ కిరణాల ద్వారా శుభ్రపరిచిన తర్వాతే పునర్వినియోగానికి పంపాలని చెప్పామన్నారు. ఇప్పటికే వైరస్‌ ప్రభావం బాగా ఉన్న ప్రాంతాల్లో బ్యాంకుల నుంచి నగదు సరఫరాను నిలిపివేసినట్లు చెప్పారు. నగదు బదులు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ ఉపయోగించుకునేలా సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రోత్సహిస్తోందని చెప్పారు.

చైనా బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ నియంత్రణ సంస్థ వైస్‌ ఛైర్మన్‌ లియాంగ్‌ టావో మాట్లాడుతూ.. వ్యాధిపై పోరాడేందుకు రాష్ట్ర సంస్థలకు, ప్రభుత్వ బ్యాంకులకు 534బిలియన్ల యువాన్లు కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా బ్యాంకులు రుణాల నగదు వసూళ్లను వాయిదా వేసుకోవాలని సూచించినట్లు తెలిపారు.  

కొవిడ్‌ వైరస్‌ దరిచేరకుండా ముఖానికి మాస్కులు, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం తప్పనిసరంటూ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే చైనాలో దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య 1523కు చేరింది. కొవిడ్ సోకిన వారి సంఖ్య 66వేలకు చేరినట్లు చైనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని