కరోనా ఎఫెక్ట్‌: మరో 97 మంది..

చైనాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా మృతుల సంఖ్య 908కి చేరింది. ఇక ఈ వైరస్‌ 40వేల మందికి పైగా సోకినట్లు నిర్ధారించారు. వీరిలో 296 మంది........

Published : 10 Feb 2020 09:12 IST

బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా మృతుల సంఖ్య 908కి చేరింది. ఈ వైరస్‌ 40వేల మందికి పైగా సోకినట్లు నిర్ధారించారు. వీరిలో 296 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజే 97 మంది మృత్యువాతపడగా.. మరో 3,062 మందిలో ఈ వైరస్‌ను గుర్తించారు. వైరస్‌కు కేంద్రంగా ఉన్న హుబెయ్‌లోనే 91 మంది చనిపోయారు. మరో 4,008 మంది అనుమానితులకు ఆదివారం వైద్యపరీక్షలు నిర్వహించారు. 23,589 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచారు. ఇక వైరస్‌ బారి నుంచి బయటపడి 3,281 మంది ఇళ్లకు చేరుకున్నారు. బాధితులతో సంబంధం ఉన్నట్లు అనుమానం ఉన్న మరో 1.87లక్షల మందిపై నిఘా ఉంచారు. ఇక హాంకాంగ్‌లో 36, మకావులో 10, తైవాన్‌లో 18 మందికి ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. భారత్‌లో మూడు కేసులు సహా మొత్తం విదేశాల్లో ఇప్పటి వరకు 300 కరోనా కేసులు నమోదయ్యాయి. 

నూతన సంవత్సర సెలవులు ముగియడంతో చాలా మంది ఉద్యోగులు తిరిగి బీజింగ్‌ సహా ఇతర నగరాలకు చేరుకుంటున్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. జనవరి 24న ప్రారంభమైన సెలవులు ఫిబ్రవరి 3తోనే ముగిసినప్పటికీ.. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాటిని 9వ తేదీ వరకు పొడిగించారు. హుబెయ్‌ వెలుపల ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుతోందని అధికారులు తెలిపారు. 

తాజా పరిస్థితుల నేపథ్యంలో బీజింగ్‌ నుంచి వచ్చిన పిలుపు మేరకు ‘ఇంటర్నేసనల్‌ మిషన్‌’ను చైనాకు పంపనున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. చైనాలో వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనోమ్‌ తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని