కరోనా.. గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ

ప్రాణాంతకంగా మారి అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది...........

Updated : 31 Jan 2020 11:39 IST

213కు చేరిన కరోనా మృతుల సంఖ్య

జెనీవా‌: ప్రాణాంతకంగా మారి అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ విస్తరిస్తున్న తీరు..రోజురోజుకీ మరణాలు సంఖ్య పెరుగుతుండడాన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ఆరోగ్య ఆత్యయిక స్థితి(గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ)గా ప్రకటించింది. దీంతో ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని సందేశాన్ని పంపింది. ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న వ్యవస్థల్లో ఈ వైరస్ తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడానికి చైనా తీసుకుంటున్న చర్యల్ని కొనియాడిన ఆయన.. ఇతర దేశాలు సైతం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వివిధ దేశాలు ప్రయాణాలపై విధిస్తున్న ఆంక్షల్ని డబ్ల్యూహెచ్‌ఓ తప్పుబట్టింది. దీని వల్ల బాధితులకు సరైన సహాయ సహకారం అందించేందుకు అడ్డంకులు ఏర్పడతాయని అభిప్రాయపడింది. తాత్కాలికంగా ఇలాంటి చర్యలు ఉపశమనం కలిగించినట్లు కనిపించినా.. దీర్ఘకాలంలో దుష్పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

200 దాటిన మృతుల సంఖ్య...

మరోవైపు కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 213కు చేరింది. మరో 9816 మందికి ఈ వైరస్‌ సంక్రమించినట్లు గుర్తించారు. ఒక్క చైనాలోనే 9692 మందిని బాధితులుగా గుర్తించగా.. హాంగ్‌కాంగ్‌లో 12, మకావు 7, తైవాన్‌ 9, ఇతర ఆసియా దేశాల్లో 62, ఐరోపాలో 13, ఉత్తర అమెరికాలో 8, ఆస్ట్రేలియాలో 9, ఇతర ప్రాంతాల్లో 4 కేసులు నమోదైనట్లు ధ్రువీకరించారు. ఇక వైరస్‌కు కేంద్ర బిందువుగా ఉన్న హుబెయ్ ప్రావిన్సులో 204 మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 20 దేశాలకు కరోనా వైరస్ పాకినట్లు ధ్రువీకరించారు.

ఇవీ చదవండి..

కరోనా భయం.. కదల్లేని దైన్యం

భారత్‌కు చేరిన కరోనా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని