సీబీఐ ముందు హాజరైన అనిల్‌ దేశ్‌ముఖ్‌!

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నేడు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణకు హాజరయ్యారు.

Published : 14 Apr 2021 15:35 IST

అవినీతి ఆరోపణల కేసులో దర్యాప్తు ముమ్మరం

ముంబయి: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నేడు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ముందు విచారణకు హాజరయ్యారు. ముంబయిలోని డీఆర్‌డీఓ గెస్ట్‌హౌస్‌లో సీబీఐ బృందం ఆయనను విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నెలకు రూ.వంద కోట్లు వసూలు చేయాలని పోలీస్‌ అధికారులను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు జరుగుతోన్న విషయం తెలిసిందే.

ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.వంద కోట్లను వసూలు చేయాలని సస్పెండైన పోలీసు అధికారి సచిన్ వాజేని ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ ఆరోపించారు. వీటితో పాటు పోలీసు అధికారుల బదిలీల్లోనూ అనిల్‌ దేశ్‌ముఖ్‌ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వీటిపై విచారణ జరిపించాలని పరమ్‌బీర్‌ సింగ్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపి 15రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ బృందం.. ఇప్పటికే అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఇద్దరు వ్యక్తిగత సహాయకులను విచారించగా..తాజాగా ఆయనను కూడా విచారిస్తోంది.

అయితే, అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలను సచిన్‌ వాజే కూడా ధ్రువపరిచినట్లు ఎన్‌ఐఏ ఇప్పటికే వెల్లడించింది. ముఖేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో లభ్యమైన పేలుడు పదార్థాల కారు కేసులో సచిన్‌ వాజేను ఎన్‌ఐఏ విచారిస్తోంది. ఇదిలాఉంటే, ఇప్పటికే సచిన్‌ వాజేపై సస్పెన్షన్‌ కొనసాగుతుండగా..ఆయనను సర్వీసుల నుంచి తొలగించే ప్రక్రియను అధికారులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని