Srilanka Food Crisis: రావణా.. కాస్త అన్నం పెట్టవయ్యా..!

lఅఆహార, ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడుతోంది. నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యావసరాల కోసం క్యూలైన్లలో బారులు తీరి......

Updated : 10 Sep 2021 17:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆహార, ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడుతోంది. నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యావసరాల కోసం క్యూలైన్లలో బారులు తీరి అవస్థలు పడుతున్నారు. అమాంతం ధరలు పెరిగిపోవడంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ఇటీవల జాతీయ ఆహార అత్యయిక పరిస్థితిని విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు శ్రీలంకకు ఏమైంది? ఈ సంక్షోభానికి దారి తీసిన పరిస్థితులపై ప్రత్యేక కథనం..

దాదాపు 2.18 కోట్లకు పైగా జనాభా కలిగి శ్రీలంకను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. గతంలో జరిగిన ఉగ్ర దాడులు, కరోనా సంక్షోభం, ప్రభుత్వం తీసుకొన్న కొన్ని అసందర్భ నిర్ణయాలు ఆ దేశానికి పెను ముప్పును తెచ్చిపెట్టాయి. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు చేసిన ప్రయత్నాలూ బెడసి కొట్టడంతో శ్రీలంక పరిస్థితి దుర్భరంగా మారింది.  2019లో జరిగిన ఈస్టర్‌ బాంబు దాడులతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉన్న పర్యాటక రంగం కుదేలైంది. దీనికితోడు కరోనా దెబ్బతో ఈ రంగం ద్వారా వచ్చే ఆదాయం పాతాళానికి పడిపోయింది. 

భారీగా విదేశీ మారక నిల్వల పతనం

శ్రీలంక  విదేశీ రుణభారం పెరిగిపోవడం, విదేశీ మారకద్రవం నిల్వలు పడిపోవడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అంతకముందు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లిన శ్రీలంక పర్యాటక రంగంలో 2019లో ఈస్టర్‌ బాంబు దాడులతో పతనం మొదలైంది. కరోనా మహమ్మారి కంటే ముందే జరిగిన ఈ ఉగ్ర దాడుల మూలంగా విదేశీ మారకద్రవ్యాన్ని కోల్పోయింది. మరోవైపు, టీ, వస్త్ర పరిశ్రమలు కూడా కరోనా దెబ్బకు కుదేలు కావడంతో ఎగుమతులు దెబ్బతిన్నాయి. 2020లో చెల్లింపులు పెరిగినప్పటికీ అవి శ్రీలంకను సంక్షోభం నుంచి బయటపడేసేంతగా లేవు.  సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ శ్రీలంక వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019 నవంబరులో దేశంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 7.5 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారక నిల్వలు.. ఈ ఏడాది జూలై నాటికి 2.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అలాగే, విదేశాలకు తిరిగి చెల్లించాల్సిన అప్పులు కూడా 4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అమెరికా డాలర్‌తో పోల్చితే శ్రీలంకన్‌ రూపీ విలువ 20 శాతానికి పైగా పడిపోయింది. దీంతో దిగుమతులపై ప్రభావం పడింది.  భారతదేశం నుంచి ఆశించిన 400 మిలియన్‌ డాలర్ల కరెన్సీ మార్పిడి ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు, మార్చిలో శ్రీలంక చైనా నుంచి 1.5బిలియన్‌ డాలర్ల కరన్సీ మార్పిడి ఒప్పందాన్ని చేసుకొంది. గత నెలలో బంగ్లాదేశ్ 250 మిలియన్‌ డాలర్ల రుణ మార్పిడి ఒప్పందంలో తొలి విడతగా 50 మిలియన్‌ డాలర్లు ఇచ్చింది.

దిగుమతులు నిషేధించినా ఫలితం శూన్యం!

విదేశీ మారక నిల్వలను ఆదా చేసే క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలోనే మసాలా దినుసులు, వంట నూనెలు, పసుపు, వాహనాలు, టూత్‌ బ్రష్‌లు ఇతరత్రావాటి దిగుమతులను నిషేధించినా ఫలితం లేకపోయింది. అయితే, నిత్యావసర ఆహార వస్తువులైన పప్పులు, పంచదార, గోధమ పిండి, కూరగాయలు, వంటి వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. డిమాండ్‌, సరఫరాకు మధ్య నెలకొన్న తీవ్ర అంతరంతో పెను సంక్షోభం ఏర్పడింది.

18 నెలలుగా కరెన్సీ ముద్రించినా..

ఈ ఆర్థిక సంక్షోభం తొలగించేందుకు శ్రీలంక సెంట్రల్‌ బ్యాంకు గత 18 నెలలుగా ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని పెంచేందుకు 800 బిలియన్‌ రూపాయల కరెన్సీని ముద్రించింది. అయితే, డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీసింది. ఇది కరెన్సీ విలువను తగ్గించడంతో పాటు దిగుమతులను మరింత ప్రియం చేసింది. మరోవైపు, విదేశీ మారకద్రవ్యం తీవ్ర ఒత్తిడిలో పడింది. అత్యయిక పరిస్థితి కింద ప్రభుత్వం నిత్యావసర వస్తువులన్నింటికీ ధరలను ఖరారు చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా దిగుమతులపై ప్రభావం చూపించింది. అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేసిన వస్తువుల ధరలపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో వ్యాపారులు విముఖత ప్రదర్శిస్తున్నారు. 

ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా గొటబయ రాజపక్స, ఆయన అగ్రసోదరుడు మహీందా రాజపక్స ప్రధానిగా ఉన్నారు. ఇతర సోదరులు కూడా  కీలకపదవుల్లో ఉన్నారు. కుటుంబ పాలనతో పాటు చైనా వైపు మొగ్గుచూపడం, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి.. వంటి విమర్శలు వస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. తాజాగా దేశాన్ని ఆకలిమంటల్లోకి నెట్టివేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. పురాణాల్లో లంకను పాలించిన రాక్షసరాజు రావణుని తరహాలో పాలన ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంక్షోభాలు కొత్తేం కాదు..

శ్రీలంకకు ఇలాంటి సంక్షోభాలు కొత్తేం కాదు. ఎల్‌టీటీఈతో జరిగిన సుదీర్ఘ యుద్ధం (2011లో ముగిసింది)తో మూడు దశాబ్దాల పాటు ఎమర్జెన్సీ అమలైంది. ఆ తర్వాత 2018లో ముస్లిం వ్యతిరేక అల్లర్లు, 2019లో ఈస్టర్‌ బాంబు దాడులు శ్రీలంకకు తీవ్ర నష్టాన్నే మిగిల్చాయి. 1970లలో కూడా శ్రీలంక ఆహార సంక్షోభాన్ని చవి చూసింది. సిరిమావో బండారు నాయకే సారథ్యంలోని ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆహార సంక్షోభం సమయంలోనూ  ప్రభుత్వ దుకాణాల ముందు భారీ ఎత్తున క్యూలైన్లు ఉండేవి. అప్పటి పరిస్థితులను గుర్తు చేస్తూ.. సండే టైమ్స్‌ సంపాదకీయం రాస్తూ.. ‘‘రేషన్‌ కార్డులపై ప్రతి కుటుంబానికి  బియ్యం, పంచదార, కిరోసిన్‌, పిండి, పప్పు, ఇచ్చేవారు. రొట్టె, బట్ట కోసం భారీ క్యూలు ఉండేవి. విదేశీ మారక ద్రవ్యంపై నియంత్రణ కఠినంగా ఉండేది. ఆహారంతో మళ్లీ నౌకలు ఎప్పుడు వస్తుందోనని సీనియర్‌ సిటిజన్లు ఎదురుచూడటం వారికి గుర్తుండే ఉంటుంది’’ అని పేర్కొంది.

రసాయనాలపై నిషేధంతో మరింత సంక్షోభం

శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్స ఈ ఏడాది మార్చిలో  రసాయనాలు, పురుగు మందులపై నిషేధం విధించారు. ఆర్గానిక్‌ పద్ధతుల్లోనే వ్యవసాయం చేయాలన్న ప్రకటన కూడా ఆహార కొరతకు కారణమని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడంతో పాటు ఎరువుల దిగుమతుల్లో విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసుకోవడమే ఈ చర్యల లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నప్పటికీ అకస్మాత్తుగా ఈ మార్పులు తీసుకురావడంతో సంక్షోభానికి కారణమయ్యాయి. సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయానికి భూములను సిద్ధం చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడంతో కూరగాయలు, బియ్యం దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపించింది. 

ఎమర్జెన్సీపై ప్రతిపక్షాల ఆందోళన

మరోవైపు, దేశంలో ఫుడ్‌ మాఫియాను నియంత్రించి ధరలు అదుపు చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఆగస్టు 30న శ్రీలంక ప్రభుత్వం ఆరోగ్య అత్యయిక పరిస్థితిపై నిర్ణయం ప్రకటించగా.. ఈ నెల 6న పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను ఆసరాగా చేసుకొని నిత్యావసర ధరలను అమాంతం పెంచేసిన ఆహార మాఫియా ఆగడాలను అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులను పరిమితం చేయడంతో పాటు నిరంకుశ ధోరణులు పెరిగేందుకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఎమర్జెన్సీ అవసరం లేదని, ఆహార ధరల నియంత్రణకు అనేక చట్టాలు ఉన్నాయంటూ ప్రతిపక్ష సభ్యులు వాదిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని