Corona: చైనా సహకరించాలి: డబ్ల్యూహెచ్‌వో

కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెండ్రోస్‌ గెబ్రెయెసస్‌ అన్నారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ మొట్టమొదటి కేసు 2019లో చైనాలోని వుహాన్‌లోనే గుర్తించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ‘‘ కరోనా వైరస్‌ మూలాలను తెలుసుకునేందుకు చైనా సహకరిస్తుందని ఆశిస్తున్నాం’’ అని జెనీవాలో నిర్వహించిన...

Published : 15 Jul 2021 20:48 IST

జెనీవా: కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా కచ్చితంగా సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెండ్రోస్‌ గెబ్రెయెసస్‌ సూచించారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ మొట్టమొదటి కేసు 2019లో చైనాలోని వుహాన్‌లోనే గుర్తించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ‘‘ కరోనా వైరస్‌ మూలాలను తెలుసుకునేందుకు చైనా తప్పనిసరిగా సహకరిస్తుందని ఆశిస్తున్నాం’’ అని జెనీవాలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. వూహాన్‌ ల్యాబ్‌నుంచే వైరస్ వ్యాప్తి చెందిందని పలు దేశాలు, పరిశోధనలు ఘంటాపథంగా చెబుతున్నప్పటికీ చైనా వాటిని కొట్టిపారేస్తోంది. అసలు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వస్తున్నా వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాగ్స్‌, గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్‌ రికార్డులను మాత్రం ఎవరికీ ఇవ్వడం లేదు. ల్యాబ్‌లో పరిశోధనలు జరుగుతున్నప్పుడు కెమెరాలో చిత్రీకరిస్తారు. ఆ క్లిప్‌లు కూడా బయటపెట్టడం లేదు. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి రావడంతో డబ్ల్యూహెచ్‌వో దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ల్యాబ్‌ను సందర్శించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం మొక్కుబడిగా నివేదిక ఇచ్చింది. ‘పీ4 ల్యాబ్‌లోని యానిమల్‌ రూమ్‌లో వివిధ జంతువులు ఉండొచ్చు. సార్స్‌కోవ్‌-2 వంటి వాటిపై కూడా పనిచేయవచ్చు’ అని తెలిపింది. అంతేకానీ, అక్కడ గబ్బిలాలను పెంచుతున్న విషయం పేర్కొనలేదు.

మరోవైపు చైనా ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీకవ్వడం వల్లే కొవిడ్‌ మహమ్మారి ఉత్పన్నమై ఉంటుందన్న వాదనను విశ్వసించొచ్చని అమెరికా ప్రభుత్వ అధీనంలోని లారెన్స్ లివర్‌మోర్‌ జాతీయ లేబోరేటరీ 2020 మే నెలలోనే నిర్ధారించినట్లు తెలుస్తోంది. అయితే, ఆయా అంశాలపై మరింత లోతుగా పరిశోధించాలంటే చైనా సహకారం పూర్తిగా ఉండాలి. కానీ, డ్రాగన్‌ మాత్రం అందుకు ఆసక్తి చూపడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు