పరంబీర్‌ పిటిషన్‌: బాంబే హైకోర్టు తీర్పు రిజర్వ్‌!

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అవినీతిపై విచారణ జరపాలంటూ పరంబీర్‌ వేసిన పిటిషన్‌పై తీర్పును బాంబే హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది.

Published : 31 Mar 2021 20:56 IST

ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అవినీతిపై విచారణ జరపాలంటూ పరంబీర్‌ వేసిన పిటిషన్‌పై తీర్పును బాంబే హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. పరంబీర్‌ తరపున న్యాయవాదితో పాటు ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ జీఎస్‌ కులకర్ణీలతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది.

నగరంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100కోట్ల వసూలు చేయాలంటూ పోలీసు అధికారులకు టార్గెట్‌ విధించడంతోపాటు పోలీసు అధికారుల బదిలీల్లో హోంమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పరంబీర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ విచారణలో భాగంగా పరంబీర్‌ తరపు న్యాయవాదిని హైకోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. హోంమంత్రిపై చేసిన ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా సీబీఐ దర్యాప్తునకు ఎలా ఆదేశించాలంటూ ప్రశ్నించింది. సీనియర్‌ పోలీసు అధికారి అయ్యి ఉండీ కూడా ఈ విషయం చెప్పాలా? అని ప్రశ్నించింది. అంతేకాకుండా ఎలాంటి ఫిర్యాదు లేకుండా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు విషయాల్లో ఎలా జోక్యం చేసుకోవాలని పరంబీర్‌ తరపు న్యాయవాది విక్రం నాంకనీని అడిగింది.

హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వీటిపై సీబీఐ విచారణ జరిపించాలని ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్ తొలుత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు, పరంబీర్‌ చేసిన ఆరోపణలు తీవ్రమైనవి అభిప్రాయపడింది. అయితే, దీనిపై తొలుత బాంబే హైకోర్టుకు వెళ్లాలని పరంబీర్‌కు సూచించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు పరంబీర్‌ సింగ్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, విచారణ పూర్తిచేసిన హైకోర్టు... ఆదేశాలను రిజర్వ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని