Modi Adviser: మోదీ సలహాదారుగా అమిత్‌ ఖారే నియామకం

ప్రధాని నరేంద్ర మోదీకి సలహాదారుగా మాజీ ఐఏఎస్‌ అధికారి అమిత్‌ ఖారే నియమితులయ్యారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన .......

Published : 12 Oct 2021 20:37 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి సలహాదారుగా మాజీ ఐఏఎస్‌ అధికారి అమిత్‌ ఖారే నియమితులయ్యారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన గత నెలలో పదవీ విరమణ పొందారు. రెండేళ్ల పాటు కాంట్రాక్టు బేసిస్‌లో ఆయన పీఎంవోలో ప్రధాని సలహాదారుగా కొనసాగుతారని సిబ్బంది, వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. అమిత్‌ ఖారే 1985 బ్యాచ్‌ బిహార్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పలు హోదాల్లో కీలకంగా పనిచేశారు. సెప్టెంబర్‌ 30న పదవీవిరమణ పొందారు. పీఎంవోలో ప్రధానికి సలహాదారుగా ఆయన నియామకాన్ని కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది.  

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం-2020 రూపకల్పనలోనూ ఖారే మంచి సహకారం అందించారు. 2018 మే నుంచి 2019 డిసెంబర్ వరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో డిజిటల్ మీడియా కీలక నిబంధనల రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషించారు. అంతకుముందు 1990ల కాలంలో ఉమ్మడి బిహార్‌ రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో దేశంలోనే సంచలనం సృష్టించిన దాణా కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన అధికారిగా గుర్తింపు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని