Corona: మళ్లీ 4లక్షలు దాటిన యాక్టివ్‌ కేసులు..

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 40వేల పైనే ఉంటున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా మరో 42,618 మంది వైరస్‌ బారినపడ్డారు

Updated : 04 Sep 2021 11:04 IST

40వేల పైనే కొత్త కేసులు

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 40వేల పైనే ఉంటున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా మరో 42,618 మంది వైరస్‌ బారినపడ్డారు. క్రితం రోజు(45,352)తో పోలిస్తే 6శాతం తక్కువ కేసులు నమోదవడం కాస్త ఊరటనిస్తోంది. ఇక మరణాలు కూడా 400 దిగువనే ఉన్నాయి. అయితే కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసులు మళ్లీ 4లక్షలు దాటడం గమనార్హం.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,618 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.29కోట్లు దాటింది. ఇదే సమయంలో 36,385 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.21కోట్ల మంది కొవిడ్‌ను జయించగా.. రికవరీ రేటు 97.43శాతంగా ఉంది. నిన్న మరో 330 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. వైరస్‌ దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4,40,225 మందిని బలితీసుకుంది.

మరోవైపు కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు మళ్లీ 4లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,05,681 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.23శాతంగా ఉంది. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కేరళలో నిన్న కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అక్కడ 29,322 కొత్త కేసులు బయటపడగా.. 131 మరణాలు నమోదయ్యాయి. 

ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న మరో 58.85లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు 67.72కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని