బెంగాల్‌లో ఎన్‌ఆర్సీని అనుమతించం: మమత

పశ్చిమబెంగాల్‌లో జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్‌ఆర్పీ) లేదా జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్‌)లను అనుమతించేది లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలోని వారంతా ఈ దేశ పౌరులేనని..

Published : 09 Dec 2020 23:51 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్సీ) లేదా జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌)లను అనుమతించేది లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలోని వారంతా ఈ దేశ పౌరులేనని.. దాన్ని ఎవరూ మార్చలేరని ఆమె అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను ఉపయోగించి భాజపా విభజన రాజకీయాలు చేసేందుకు యత్నిస్తోందని ఆమె విమర్శించారు. ఈ మేరకు ఆమె ఉత్తర 24 పరగణాలు జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు.

‘నేను ఈ రాష్ట్ర సీఎంగా చెప్తున్నా. మీరంతా ఈ దేశ పౌరులే. దాన్ని ఎవరూ మార్చలేరు. ఎన్ఆర్సీ లేదా ఎన్‌పీఆర్‌లను మేం రాష్ట్రంలో అనుమతించం’ అని మమతా బెనర్జీ అన్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలో సీఏఏ అమలు చేస్తామని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వర్గీయ గతవారం చెప్పిన నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

‘మేం బెంగాల్‌ను గుజరాత్‌గా మారనివ్వం. విభజన రాజకీయాలతో భాజపా దేశాన్ని నాశనం చేస్తోంది. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రధాని మోదీ మూడు వ్యవసాయ సంబంధిత చట్టాలను తీసుకువచ్చారు. ఆంఫన్‌ తుపాను బాధితులకు సాయంపై భాజపా తప్పుడు ఆరోపణలు చేస్తోంది. రాష్ట్ర జీఎస్టీ పరిహారం ఇవ్వడానికి కేంద్రం నిరాకరిస్తోంది. కఠినమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం’ అని చెప్పారు. సభలో కొందరు తమ సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శించగా.. వాటిపై మమత స్పందిస్తూ.. ‘మీరు ప్లకార్డులు ప్రదర్శించకండి.. నేరుగా మీ సమస్య ఏంటో నాకు లేఖ ఇవ్వండి.. దాన్ని నేను పరిష్కరిస్తాను’ అని అన్నారు. రాష్ట్రంలో విభజన రాజకీయాలు చేయడానికి కొందరు బయటి నుంచి వచ్చి ఇంటింటి ప్రచారం ప్రారంభించారని విమర్శించారు. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం బెంగాల్‌ పర్యటనలో భాగంగా ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. 

ఇదీ చదవండి

తొలి టీకా నేనే తీసుకుంటా.. ఇజ్రాయెల్‌ ప్రధాని

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు