‘వారి వల్లే ఇన్నాళ్లూ ఓటుహక్కు కోల్పోయారు’

పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన శరణార్థులకు కశ్మీర్‌‌లోని రాజకీయ పార్టీలు ఇన్నాళ్లూ ఓటు హక్కు కల్పించలేదని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. కానీ అలాంటివారికి మోదీ ప్రభుత్వం ఆ అవకాశం కల్పించిందని ఇరానీ వెల్లడించారు.

Updated : 06 Dec 2020 19:50 IST

శ్రీనగర్‌: పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన శరణార్థులకు కశ్మీర్‌‌లోని రాజకీయ పార్టీలు ఇన్నాళ్లూ ఓటు హక్కు కల్పించలేదని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. కానీ అలాంటివారికి మోదీ ప్రభుత్వం ఆ అవకాశం కల్పించిందని ఇరానీ వెల్లడించారు. కశ్మీర్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు స్టార్‌ ప్రచారకర్తగా ఉన్న ఆమె ఆదివారం మాట్లాడుతూ.. ఇటీవల అక్కడ ఏర్పాటైన గుప్‌కార్‌ డిక్లరేషన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.  ‘గుప్‌కార్‌ గ్యాంగ్‌ తమ చేతిలో అధికారం ఉన్నప్పుడు శరణార్థులకు ఓటు హక్కు కల్పించలేదు. పాక్‌ను కాదని హిందుస్థాన్‌ను ఎంచుకున్న శరణార్థి కుటుంబాల పరిస్థితిని ప్రధాని నరేంద్రమోదీ అర్థం చేసుకున్నారు. అందుకే వారికి మోదీ ఓటు హక్కు కల్పించారు. ప్రజలకు అవసరమైనపుడు ఈ పార్టీలు ఏకం కావు. కానీ అనవసరమైన సమయంలో వారు ఇప్పుడు ఏకమవుతున్నారు’ అని ఆమె ఆ రాజకీయ పార్టీల కూటమిపై విమర్శలు చేశారు. 

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని తిరిగి పునరుద్ధరించాలంటూ పీడీపీ, ఎన్సీ సహా పలు రాజకీయ పార్టీలు పీపుల్స్‌ అలయన్స్‌గా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ, ఎన్సీ నాయకుడు ఫరూఖ్‌ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు ఆర్టికల్‌ 370 పునరుద్ధరణకు చైనా సాయం కోరతామని అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం గతేడాది పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పాక్‌, అఫ్గన్‌..తదితర దేశాల్లో మైనారిటీలుగా ఉండి హింసకు గురై శరణార్థులుగా భారత్‌కు వచ్చిన వారికి ఆ చట్టం ద్వారా ఓటు హక్కు వస్తుంది. కశ్మీర్‌ కేంద్ర పాలనలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని అక్కడ అమలు చేశారు.  

ఇదీ చదవండి

టీకా కోసం తొక్కిసలాట జరగొచ్చు: డబ్ల్యూహెచ్‌వో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని