దేశంలో ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ సాధ్యం కాదు!

అధిక జనాభా కలిగిన దేశంలో సాధరణ ప్రక్రియలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కేవలం ఇమ్యూనైజేషన్‌ ద్వారానే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించగలమని పేర్కొంది. వ్యాక్సిన్‌ వచ్చిన అనంతరం ఇది సాధ్యమవుతుందని......

Published : 31 Jul 2020 02:28 IST

ఇమ్యూనైజేషన్‌తోనే సాధ్యమన్న కేంద్ర ఆరోగ్యశాఖ
దేశంలో కరోనా రికవరీ రేటు పెరిగిందని వెల్లడి

దిల్లీ: అధిక జనాభా కలిగిన దేశంలో సాధారణ ప్రక్రియలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కేవలం ఇమ్యూనైజేషన్‌ ద్వారానే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించగలమని పేర్కొంది. వ్యాక్సిన్‌ వచ్చిన అనంతరం ఇది సాధ్యమవుతుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈవైరస్‌ను ఎదుర్కోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. దేశంలో కరోనా వైరస్‌ తాజా పరిస్థితులపై ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల రికవరీ రేటు 64.4శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఏప్రిల్‌ నెలలో 7.85 శాతంగా ఉన్న ఈ రేటు ప్రస్తుతం 64 శాతానికి చేరుకోవడం ఊరట కలిగించే విషయమని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా వైరస్‌ బారినపడిన వారిలో ఇప్పటివరకు 10లక్షల మంది కోలుకున్నారని స్పష్టం చేసింది. వైద్యులు, నర్సులతోపాటు ఇతర సిబ్బంది కృషి ఫలితంగానే బాధితులు ఈ స్థాయిలో కోలుకుంటున్నట్లు అభిప్రాయపడింది.

16 రాష్ట్రాల్లో ఎక్కువ రికవరీ..
ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకునే వారి శాతం జాతీయసగటు కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. అత్యధిక రికవరీ రేటు దిల్లీలో 88 శాతం ఉండగా, లద్దాఖ్‌లో 80%, హరియాణా 78%, అసోం 76%, తెలంగాణ 74%, తమిళనాడు, గుజరాత్‌లలో 73%, రాజస్థాన్‌ 70%, మధ్యప్రదేశ్‌ 69%, గోవాలో 68% మంది కోలుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కోటీ 81లక్షల కొవిడ్‌ పరీక్షలు..
దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా నిర్ధారణ పరీక్షలు భారీగా పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు కోటీ 81 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. నిత్యం జరిపే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత పెంచుతున్నామని తెలిపింది. ప్రస్తుతం ప్రతిరోజూ ప్రతి పదిలక్షల జనాభాకు 324 టెస్టులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

మూడో దశలో 3 వ్యాక్సిన్లు..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ల రూపకల్పనలో పలు దేశాలు నిమగ్నమయ్యాయి. వీటిలో అమెరికా, యూకే, చైనా దేశాల వ్యాక్సిన్లు మూడో దశలో ఉన్నాయి. ఇక భారత్‌లో మాత్రం దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్లు ఫేజ్‌-1, ఫేజ్-‌2 దశల్లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొదటి వ్యాక్సిన్‌ను 8 ప్రదేశాల్లో దాదాపు 1150 మందిపై ప్రయోగిస్తుండగా, రెండో వ్యాక్సిన్‌ను ఐదు ప్రదేశాల్లో వెయ్యి మందిపై ప్రయోగిస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన అనంతరం దాన్ని ఎవరికి, ఎలా ఇవ్వాలనే విషయాలపై కేంద్ర ప్రభుత్వం చర్చిస్తోందని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ అభిప్రాయపడ్డారు.

2.21 శాతానికి తగ్గిన మరణాల రేటు..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల రేటు భారత్‌లోనే తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ప్రపంచ సగటు 4శాతం ఉండగా భారత్‌లో 2.21శాతంగా ఉన్నట్లు తెలిపింది.

అత్యధిక మరణాల రేటు ఉన్న దేశాలు..

దేశం    మరణాల రేటు(శాతంలో)
యూకే     15.3
మెక్సికో    11.1
ఇరాన్‌     5.5
బ్రెజిల్‌     3.6
అమెరికా   3.5
భారత్‌     2.21
రష్యా      1.6

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని