కరోనా నేర్పిన పాఠం.. ఇక అలా ఆధారపడొద్దు!

అంతర్జాతీయ సప్లై చైన్‌ ఒకే దేశంపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో కరోనా వైరస్‌ మనకు నిరూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డెన్మార్క్‌ ప్రధాని మెటి ఫ్రెడరిక్‌సన్‌తో సోమవారం జరిగిన వర్చువల్‌ ద్వైపాక్షిక సమావేశంలో ఏ దేశం పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా చైనాను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Published : 28 Sep 2020 20:04 IST

దిల్లీ: అంతర్జాతీయ సప్లై చైన్‌ ఒకే దేశంపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో కరోనా వైరస్‌ మనకు నిరూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. డెన్మార్క్‌ ప్రధాని మెటి ఫ్రెడరిక్‌సన్‌తో సోమవారం జరిగిన వర్చువల్‌ ద్వైపాక్షిక సమావేశంలో ఏ దేశం పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా చైనాను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ సప్లై చైన్‌ ఒకే దేశంపై ఆధారపడడం ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో కరోనా మనకు నిరూపణ చేసిందని పరోక్షంగా చైనాను ఉద్దేశిస్తూ మోదీ పేర్కొన్నారు. ఈ విధానంలో మార్పులు తెచ్చేందుకు భారత్‌ ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి పనిచేయడం ప్రారంభించిందన్నారు. ఈ పద్ధతికి సానుకూలంగా ఉన్న దేశాలు ఇందులో భాగస్వామ్యం కావచ్చని పేర్కొంటూ మోదీ వారికి స్వాగతం  చెప్పారు. గత కొద్ది నెలల కాలంలో జరిగిన సంఘటనలు మూలంగా వివిధ దేశాలు కలిసి పనిచేయవలిసిన అవసరం ఏర్పడిందన్నారు. 

ఈ సందర్భంగా మోదీ భారత్‌లో ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం గురించి ఆయనకు వివరించారు. దాంతో పాటు వ్యవసాయం, కార్మిక రంగంలో తీసుకువచ్చిన మార్పుల గురించి తెలిపారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ కింద తాము అన్ని విధాలా సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ఉత్తర ఐరోపాకు చెందిన దేశాల్లో డెన్మార్క్‌ భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామిగా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం.. 2016 నుంచి 2019 మధ్య భారత్‌, డెన్మార్క్‌ మధ్య వాణిజ్యం 30.49శాతం పెరిగింది. దాని విలువ దాదాపు 2.82 బిలియన్‌ డాలర్ల నుంచి 3.68 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. భారత్‌లో షిప్పింగ్‌, పునరుత్పాదక విద్యుత్‌, వ్యవసాయం, ఆహార సరఫరా సహా పలు రంగాల్లో డెన్మార్క్‌కు చెందిన 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. డానిష్‌ సంస్థల్లో 5వేల మంది భారతీయులు ఉద్యోగాలు చేస్తున్నారు. అంతేకాకుండా డెన్మార్క్‌లోనూ భారత్‌కు చెందిన 20 ఐటీ సంస్థలు నడుస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని