పాక్‌ పన్నాగం.. పసిగట్టి పట్టుకున్న ఆర్మీ

భారత్‌లో విధ్వంసం సృష్టించాలని పాకిస్థాన్‌ చేస్తున్న కుట్రలను సైన్యం మరోసారి భగ్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ఆయుధాల సరఫరాను చాకచక్యంగా అడ్డుకుంది. ఈ ఉదయం జమ్ముకశ్మీర్‌లోని కెరన్‌ సెక్టార్‌లో గల కిషన్‌గంగా నదిలో ఉగ్రవాదుల కదలికలను ఆర్మీ

Published : 10 Oct 2020 14:59 IST

శ్రీనగర్‌: భారత్‌లో విధ్వంసం సృష్టించాలని పాకిస్థాన్‌ చేస్తున్న కుట్రలను సైన్యం మరోసారి భగ్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ ఆయుధాల సరఫరాను చాకచక్యంగా అడ్డుకుంది. ఈ ఉదయం జమ్ముకశ్మీర్‌లోని కెరన్‌ సెక్టార్‌లో గల కిషన్‌గంగా నదిలో ఉగ్రవాదుల కదలికలను ఆర్మీ గుర్తించింది. ఇద్దరు, ముగ్గురు ఆగంతకులు ఆయుధాలు, మందు గుండు సామగ్రిని ఒక ట్యూబ్‌లో పెట్టి తాడు సాయంతో నది గుండా భారత్‌లో పంపేందుకు ప్రయత్నిస్తుండగా.. భారత జవాన్లు గుర్తించి వెంటనే అక్కడకు చేరుకున్నారు. 

జవాన్లను చూసి ఆగంతకులు పారిపోయారు. ట్యూబ్‌ను తనిఖీ చేసిన భారత బలగాలు రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నాయి. అందులో నాలుగు ఏకే 74 తుపాకులు, ఎనిమిది మ్యాగజీన్లు, 240 రౌండ్ల బుల్లెట్‌ ట్యూబ్‌లు ఉన్నట్లు బలగాలు గుర్తించాయి. ఘటనా స్థలంలో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. 

ఘటనపై చినార్‌ కార్ప్స్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బీఎస్‌ రాజు మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని దుయ్యబట్టారు. భారత్‌లో అల్లర్లు సృష్టించేందుకు దాయాది దేశం పదేపదే ప్రయత్నిస్తోందని, అయితే వారి కుట్రలను తాము భగ్నం చేస్తూనే ఉన్నామని తెలిపారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పాక్‌ సరిహద్దు వెంబడి 250 నుంచి 300 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు లాంచ్‌ప్యాడ్ల వద్ద ఉన్నారని తెలిసినట్లు చెప్పారు. వారి ప్రయత్నాలను తాము సమర్థంగా తిప్పికొడుతున్నామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని