నగదు ప్రయోజనాలు రైతులకు అందనివ్వరేం:షా

పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ రాష్ట్ర రైతుల్ని పీఎం కిసాన్‌ నిధుల నుంచి దూరం చేశారంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. బెంగాల్‌ రెండు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మమతపై తీవ్ర విమర్శలు చేశారు.

Updated : 20 Dec 2020 21:33 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ రాష్ట్ర రైతుల్ని పీఎం కిసాన్‌ నిధుల నుంచి దూరం చేశారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. బెంగాల్‌ రెండు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మమతపై తీవ్ర విమర్శలు చేశారు. ‘రైతుల ఆందోళనలకు మీరు మద్దతు పలుకుతారు.. కానీ మీ రైతులకు మాత్రం కేంద్ర నగదు ప్రయోజనాలను రానివ్వరు. మోదీ ఇస్తున్న పీఎం కిసాన్‌ నిధులు రాష్ట్రంలోని రైతులకు అందకుండా చేస్తున్నారు’ అని షా మండిపడ్డారు. 

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఉద్దేశిస్తూ.. ‘‘నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐపీఎస్‌ అధికారులకు సమన్లు జారీ చేసే హక్కు కేంద్రానికి ఉంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో మమతా బెనర్జీ విఫలమయ్యారు. ‘ఔట్‌సైడర్స్‌, ఇన్‌సైడర్స్‌’ పేరుతో మమత ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో ఉన్న రోజుల్లో ఇందిరాగాంధీని ఔట్‌ సైడర్‌ అని పిలిచేవారా?’’ అని ప్రశ్నించారు. కరోనా వైరస్‌ నియంత్రణలోకి వచ్చాక పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. ఒకసారి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమయ్యాక సీఏఏ అమలు గురించి చర్చిస్తాన్నారు. 

‘‘తృణమూల్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర జీడీపీ ఎప్పుడూ లేనంతగా దిగజారిపోయింది. అప్పట్లో పారిశ్రామిక ఉత్పత్తికి బెంగాల్‌ సహకారం 30 శాతం ఉండేది. అది ఇప్పుడు 3.5 శాతం వద్ద ఉంది. 1960లో బెంగాల్‌ దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉండేది. 1950లో ఫార్మా ఉత్పత్తులు బెంగాల్‌లోనే 70 శాతం తయారయ్యేవి. అది ఇప్పుడు 7 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం మాకు ఉన్న ఒకే ఒక సంకల్పం ఏంటంటే.. బెంగాల్‌కు పూర్వ వైభవం కల్పించడమే’’ అని అమిత్‌షా అన్నారు.

ఇదీ చదవండి

బెంగాల్‌ మార్పును కోరుకుంటోంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని