హెర్డ్‌ ఇమ్యూనిటీకి ప్రయత్నం.. ప్రమాదం!

కరోనావైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’కి ప్రయత్నిస్తే దారుణమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

Updated : 20 Sep 2020 14:31 IST

అందుకే విరమించుకున్నామన్న కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి కచ్చితమైన ఔషధాలు లేకుండా ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’కి ప్రయత్నిస్తే దారుణమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. భారీస్థాయిలో ప్రజలు వైరస్‌ బారినపడి మరణించే ప్రమాదముందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విని కుమార్‌ చౌబే రాజ్యసభలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు‌ ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ కోసం రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయా? అని సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

‘కరోనావైరస్‌ విజృంభణ ప్రారంభమైన సమయంలో కొన్ని దేశాలు హెర్డ్‌ ఇమ్యూనిటీ దిశగా ఆలోచించాయి. దీంతో అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు వైరస్‌ బారినపడడమే కాకుండా అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నట్లు తేలింది. దీంతో మనదేశంలో అలాంటి వ్యూహాన్ని వదిలివేశాం’ అని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించాలంటే ప్రజలందరినీ వైరస్‌ బారిన పడేలా చేయాల్సి ఉంటుంది. సాధారణ ప్రక్రియలో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడమనేది ఇప్పటి వరకు పరిశోధనల్లో నిరూపితం కాలేదు. అలాంటి సమయంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ ప్రక్రియను పక్కకుపెట్టి, కేవలం వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయడమే లక్ష్యంగా చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. దీనికోసం తీసుకోవాల్సిన ప్రణాళికలు, సూచనలతో పాటు ప్రామాణిక పద్ధతుల(SoP)ను కూడా అన్ని రాష్ట్రాలకు తెలియజేశామని తెలిపారు.

కరోనా వైరస్‌ తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేయడంతోపాటు వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 1768 పరీక్షకేంద్రాలకు అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా దేశంలో ఇప్పటికే దాదాపు 30వ్యాక్సిన్‌ల ప్రయోగాలు వివిధ దశలో ఉన్నాయని పేర్కొంది. వీటిలో మూడు వ్యాక్సిన్‌లు మూడు దశల్లో ఉండగా, మరో నాలుగు ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తిచేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. ఇదిలాఉంటే, భారత్‌లో వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య 54లక్షలు దాటగా వీరిలో 86వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి..
కొవిడ్‌ రూల్స్‌: అతిక్రమిస్తే రూ.10లక్షల జరిమానా
భారత్‌లో 54లక్షలు దాటిన కేసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని