2020లో 65 మంది జర్నలిస్టుల హత్య!

గత ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా 65మంది జర్నలిస్టులు హత్యకు గురైనట్లు ఇంటర్నేషన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌(ఐఎఫ్‌జే) నివేదిక వెల్లడించింది.

Published : 12 Mar 2021 23:58 IST

మెక్సికోలో 14.. భారత్‌లో 8మంది

బ్రస్సెల్స్‌: ప్రపంచ వ్యాప్తంగా జర్నలిస్టులపై అణచివేతలు, దాడులు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఏటా హత్యకు గురౌతున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం కలవరపెడుతోంది. గత ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా 65మంది జర్నలిస్టులు హత్యకు గురైనట్లు అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. వీటిలో అత్యధికంగా మెక్సికోలో నమోదుకాగా, భారత్‌లోనూ జర్నలిస్టుల హత్యలు పెరుగుతున్నాయన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి.

2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 65మంది విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు హత్యకు గురైనట్లు ఇంటర్నేషన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్‌ (ఐఎఫ్‌జే) నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో 17 మంది జర్నలిస్టులు అదనంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అంతేకాకుండా విధి నిర్వహణలో ఉన్న దాదాపు 200మంది జర్నలిస్టులు జైలు పాలైనట్లు ఐఎఫ్‌జే పేర్కొంది. గతేడాది నమోదైన జర్నలిస్టుల హత్యలు 16 దేశాల్లో చోటుచేసుకున్నాయని తెలిపింది. ఐఎఫ్‌జే ప్రకారం, ఇలా 1990 నుంచి ఇప్పటివరకు మొత్తం 2680 మంది జర్నలిస్టులు హత్యకు గురైనట్లు నివేదించింది.

జర్నలిస్టుల హత్యలు ఎక్కువగా మెక్సికోలో నమోదు అవుతుండగా తర్వాతి స్థానాల్లో ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌, సోమాలియా దేశాల్లో నమోదవుతున్నాయి. జర్నలిస్టుల హత్యల్లో మెక్సికో వరుసగా నాలుగోసారి తొలిస్థానంలో నిలవడం అక్కడ తీవ్రతకు అద్దం పడుతోంది. గతేడాది మెక్సికోలో అత్యధికంగా 14 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోగా, ఆఫ్ఘనిస్థాన్‌లో పది మంది బలయ్యారు. ఇక పాకిస్థాన్‌లో నలుగురు, భారత్‌లో ఎనిమిది మంది, ఫిలిప్పైన్స్‌, సిరియా దేశాల్లో నలుగురు చొప్పున జర్నలిస్టులు హత్యకు గురైనట్లు ఐఎఫ్‌జే నివేదిక వెల్లడించింది. నైజీరియా(3), యెమెన్‌(3), ఇరాక్‌(2), సోమాలియా(2), బంగ్లాదేశ్‌(2), కామెరూన్‌(2), హోండూరస్‌(2), పరాగ్వే(2), రష్యా(2), స్వీడన్‌(2)లలో జర్నలిస్టులు హత్యకు గురైనట్లు ఐఎఫ్‌జే తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని