‘కొత్తరకం’పై ఆందోళన వద్దు..! సీసీఎంబీ

యూకే నుంచి భారత్‌కు వచ్చిన వారిలో దాదాపు 40మందికి పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయోలజీ(సీసీఎంబీ) విశ్లేషిస్తోంది. ఇప్పటివరకు జరిపిన విశ్లేషణలో ముగ్గురిలో కొత్తరకం వైరస్‌ గుర్తించినట్లు సీసీఎంబీ వెల్లడించింది.

Updated : 29 Dec 2020 17:15 IST

జాగ్రత్తలు పాటించాలని సూచన

హైదరాబాద్‌: బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్‌ మూలాలు భారత్‌లోనూ బయటపడ్డట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. యూకే నుంచి భారత్‌కు వచ్చిన వారిలో దాదాపు 40మందికి పాజిటివ్‌ వచ్చిన శాంపిళ్లను సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయోలజీ(సీసీఎంబీ) విశ్లేషిస్తోంది. ఇప్పటివరకు జరిపిన విశ్లేషణలో ముగ్గురిలో కొత్తరకం వైరస్‌ గుర్తించినట్లు సీసీఎంబీ వెల్లడించింది.

బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిలో పాజిటివ్‌ తేలిన 40శాంపిళ్లు మాకు చేరాయి. కొత్తరకం వైరస్‌ను కనుగొనేందుకు ఇప్పటివరకు 20శాంపిళ్ల విశ్లేషణ పూర్తిచేశాం. వీటిలో మూడు శాంపిళ్లలో బ్రిటన్‌ కొత్తరకం వైరస్‌ మూలాలు గుర్తించాం’ అని సీసీఎంబీ డైరెక్టెర్‌ రాకేశ్‌ మిశ్రా మీడియాకు వెల్లడించారు. కొత్తరకం వైరస్‌ కనిపించడం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని.. అయితే పెద్ద ఎత్తున కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఆందోళన వద్దు..
ఈ కొత్త రకం వైరస్‌ బయటపడినప్పటికీ దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీసీఎంబీ డెరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా స్పష్టంచేశారు. ఇది చూడడానికి కొత్తగా కనిపించినప్పటికీ, ఇది కూడా కరోనా వైరస్‌ కావడంతో ఎలాంటి సమస్య ఉండదని పేర్కొన్నారు. లక్షణాలు, తీవ్రత అన్నీ ఒకేవిధంగా ఉంటాయని, కేవలం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. అయితే, ఈ కొత్తరకం వైరస్‌ మాత్రం అత్యధిక వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నట్లు రాకేశ్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇదిలాఉంటే, డిసెంబర్‌ 9వ తేదీ తర్వాత యూకే నుంచి తెలంగాణకు దాదాపు 1216 మంది వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 1060 మందిని ట్రాక్‌ చేసి వైద్య పరీక్షలు నిర్వహించింది. మరో 156 మంది ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో ఇప్పటికే ఆరుగురు తిరిగి విదేశాలకు వెళ్లిపోగా, మరో 58 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఇక కొవిడ్‌ టెస్ట్‌ నిర్వహించిన 996 మందిలో 21 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ఇవీ చదవండి..
భారత్‌లోకి కరోనా ‘కొత్తరకం’
రాష్ట్రంలోకి యూకే వైరస్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు