Gulab Cyclone: ‘గులాబ్‌’ ప్రభావం.. హై అలర్ట్‌ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ

గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో వచ్చే రెండు రోజులుపాటు హైదరాబాద్‌ నగరంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) యంత్రాంగం అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ విపత్తుల నిర్వహణ విభాగం మూడు రోజులపాటు హై అలర్ట్‌ ప్రకటించింది...

Published : 27 Sep 2021 01:41 IST

హైదరాబాద్: గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో వచ్చే రెండు రోజులపాటు హైదరాబాద్‌ నగరంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) యంత్రాంగం అప్రమత్తమైంది. జీహెచ్‌ఎంసీ విపత్తుల నిర్వహణ విభాగం మూడు రోజులపాటు హై అలర్ట్‌ ప్రకటించింది. జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, హెచ్‌ఓడీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని క్షేత్ర స్థాయిలో సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఫోన్‌ కాల్స్‌కు తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పడవలు, పంపులు, ఇతర అవసరమైన పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు.

గత అనుభవాల దృష్ట్యా వరద పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున అత్యవసర స్థితిని ముందుగానే అంచనా వేసుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాలను తనిఖీ చేసి నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాలని వివరించారు. వీకాఫ్‌లు, సెలవులు వారంపాటు పరిమితంగా తీసుకోవాలని.. సిబ్బంది అందుబాటులో ఉండేలా అధికారులు ప్రణాళిక వేసుకోవాలన్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాల్సి వచ్చినా అందుకు అనుగుణంగా పునరావాస కేంద్రాలను ముందే సిద్ధం చేసుకోవాలని, అక్కడ ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. రవాణా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరదలు, లోతట్టు ప్రాంతాల గురించి ఆయా ప్రాంతాల ప్రజలను ముందస్తుగా హెచ్చరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని