Tavolara: ఇదో బుల్లిరాజ్యం.. జనాభా 11 మందే!

ఈ ద్వీపం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే.. చూడటానికి ఓ ప్రైవేటు ఐలాండ్‌లా కనిపించినా.. ఇది ఓ చక్రవర్తి పరిపాలిస్తున్న ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్నరాజ్యం. ఆ రాజ్యంలో జనాభా పదకొండు మంది...

Updated : 04 Oct 2021 11:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ద్వీపాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని వివిధ దేశాల ప్రభుత్వాల అధీనంలో ఉంటే.. మరికొన్నింటిని ధనవంతులు కొనుగోలు చేసి తమకు విడిదిగా మార్చుకుంటున్నారు. ఇంకా కొన్ని వసతులు లేక నిర్మానుష్యంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు మనం చెప్పుకునే ద్వీపం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే.. చూడటానికి ఓ ప్రైవేటు ఐలాండ్‌లా కనిపించినా.. ఇది ఓ చక్రవర్తి పరిపాలిస్తున్న ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్నరాజ్యం. ఆ రాజ్యంలో జనాభా పదకొండు మంది. వారంతా ఆ చక్రవర్తి కుటుంబసభ్యులే. 

టవోలారా.. ఇటలీకి పశ్చిమాన ఉన్న సార్డినియా ఐలాండ్‌కు సమీపంలోని చిన్న ద్వీపం. దీని విస్తీర్ణం కేవలం 5 చదరపు కిలోమీటర్లు. ఈ రాజ్యంలో ప్రస్తుత చక్రవర్తి 87 ఏళ్ల ఆంటోనియో బెర్టోలియోని. ఆయన కుటుంబ సభ్యులు పది మంది. వీరే అక్కడ నివసిస్తున్నారు. ఈ ఐలాండ్‌కు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడ వివిధ జాతులకు చెందిన మేకలు, అందమైన బీచ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే ఇక్కడికి ఏటా వేల సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. సందర్శకుల కోసం చక్రవర్తి ఆంటోనియో తన రెస్టారంట్‌ ‘డా టొనినో’లో ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తారు. ఏటా ఇటాలియన్‌ ఉత్తమ చిత్రాలను ప్రదర్శిస్తుంటారు. అంతేకాదు.. వారిని స్వయంగా పడవల్లో తిప్పుతూ గైడ్‌గా పనిచేస్తుంటారు. టూరిస్టులు లేని రోజుల్లో చేపలు పట్టి సమీప ప్రాంతాలకు వెళ్లి విక్రయిస్తుంటారు.

రెండో భార్యతో పారిపోయి వచ్చి..

ఈ రాజ్యం ఏర్పాటు వెనుక పెద్ద కథే ఉంది. 1807లో జెసెప్పే బెర్టోలియోని అనే వ్యక్తి రెండో వివాహం చేసుకొని టవోలారాకు వచ్చి స్థిరపడ్డారు. 1836లో ఓ సారి ఈ ఐలాండ్‌కు సార్డినియా చక్రవర్తి వేటకు వచ్చి జెసెప్పే ఇంట్లో బస చేశాడు. ఆ సమయంలో అతడి కుమారుడు 24 ఏళ్ల పాలో.. తనను టవోలారాకు చక్రవర్తిగా రాజుకు పరిచయం చేసుకున్నాడు. మూడు రోజులు అక్కడే ఉన్న సార్డినియా చక్రవర్తి.. వారి ఆతిథ్యానికి మెచ్చి, పాలోని నిజంగానే టవోలారా చక్రవర్తిగా చేస్తానని హామీ ఇచ్చాడు.

దీంతో కొన్ని రోజులకు పాలో సార్డినియా వెళ్లి అధికారికంగా టవోలారా చక్రవర్తిగా గుర్తింపు సంపాదించాడు. అలా పాలో ఏడు తరాలు ఆ ఐలాండ్‌లో రాజభోగాలు అనుభవించారు. 1900ల్లో బ్రిటన్‌ రాణి క్వీన్‌ విక్టోరియా తన వ్యక్తిగత ఫొటోగ్రాఫర్లను ఈ ఐలాండ్‌కు పంపించి బెర్టోలియోని రాజకుటుంబం ఫొటో తీయించిందట. ఇప్పటికీ ఆ ఫొటో లండన్‌లోని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ మ్యూజియంలో ఉందట. కాగా.. 1934లో ఈ ఐలండ్‌ ఇటలీ అధీనంలోకి వచ్చింది. దీంతో బెర్టోలియోని రాచరికం ముగిసింది. కానీ, ఐలండ్‌కు రక్షకుడిగా కొనసాగే అవకాశం లభించింది. 1962లో నాటో ఆర్మీ ఇక్కడ బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఐలండ్‌లోని అధిక భూభాగాన్ని వినియోగించుకోవడంతో బెర్టోలియోని కుటుంబానికి కేవలం 50 హెక్టార్ల భూమి మాత్రమే మిగిలింది. ప్రస్తుత చక్రవర్తి ఆంటోనియో మాత్రం ఇప్పటికీ టవోలారాను ఒక స్వతంత్ర రాజ్యంగా గుర్తించాలని పోరాటం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని