560 మంది అస్తికలను నదిలో కలిపిన మంత్రి

ఎవరూ తీసుకెళ్లని, గుర్తుతెలియని వారి అస్తికలను నిమజ్జనం చేసేందుకు పూనుకున్నారు కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌.అశోక. గురువారం 560 మంది అస్తికలను ఆయన కావేరి నదిలో కలిపారు....

Published : 03 Jun 2021 01:29 IST

బెంగళూరు: మృతిచెందిన వారిని దహనం చేసిన అనంతరం వారి బూడిదను కావేరి నదిలో కలపడం దక్షిణ కర్ణాటకలో సంప్రదాయం. కానీ కరోనా మహమ్మారి అనేక మార్పులకు దారి తీసింది. వ్యాధి సోకి చనిపోయినవారి కొందరి అస్తికలను కుటుంబసభ్యులు భయంతో శ్మశానవాటికల నుంచి తీసుకెళ్లడంలేదు. కాగా ఎవరూ తీసుకెళ్లని, గుర్తుతెలియని వారి అస్తికలను నిమజ్జనం చేసేందుకు పూనుకున్నారు కర్ణాటక రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌.అశోక. గురువారం 560 మంది అస్తికలను ఆయన కావేరి నదిలో కలిపారు. ఈసందర్భంగా ఆర్‌.అశోక మాట్లాడుతూ.. ఈ రోజు కావేరిలో అస్తికలను కలుపుతున్నాం. ఈ కార్యాన్ని పవిత్రంగా భావిస్తాం. దీని ద్వారా ఈ 560 మంది స్వర్గానికి చేరుకుంటారు’ అని ఆయన తెలిపారు. 

పలు కారణాలతో కొందరి అస్తికలను కుటుంబసభ్యులు తీసుకోలేకపోయారని, అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వారి కుటుంబీకులుగానే తాము ఈ కార్యానికి పూనుకున్నట్లు వివరించారు. రెవెన్యూ మంత్రిగా ఇది తన కర్తవ్యమన్నారు. ఉత్తర భారతదేశంలో కనిపించిన కొన్ని దృశ్యాలు ఎంతో బాధను కలిగించాయని మంత్రి తెలిపారు. ‘గంగా నదిలో కరోనా మృతదేహాలు కొట్టుకుపోవడం చూస్తున్నాం. వాటిని కుక్కలు, పక్షులు పీక్కుతింటున్నాయ్‌. ఇది మనకు సిగ్గుచేటు. అందుకే ప్రాణాలు కోల్పోయిన అందరికి గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని