Doctor: కొవిడ్‌ వార్డు నా జీవితాన్ని మార్చేసింది

కరోనా విపత్తు తన జీవితానికి సరిపడా పాఠాలు నేర్పిందని.. కొవిడ్ వార్డులో పనిచేయడం జీవితం పట్ల తన దృక్పథాన్ని మార్చిందని యువ వైద్యుడు పేర్కొంటున్నారు....

Published : 25 May 2021 21:21 IST

అనుభవాలు పంచుకున్న ఓ యువ వైద్యుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కాలంలో వైద్యులు తీరిక లేని పని చేస్తున్నారు. నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు రోగులకు సేవ చేస్తున్నారు. ఎంతోమందికి ప్రాణం పోస్తున్నారు.  కొవిడ్‌ వార్డులో పనిచేసిన ఓ వైద్యుడు తన మనోభావాలను పంచుకున్నారు. ఈ విపత్తు జీవితానికి సరిపడా పాఠాలు నేర్పిందని.. కొవిడ్ వార్డులో పనిచేయడం జీవితం పట్ల తన దృక్పథాన్ని మార్చిందని యువ వైద్యుడు పేర్కొంటున్నారు. గతంలో కంటే ప్రజలకు ఇప్పుడు ఎక్కువ విలువ ఇస్తున్నానని తెలిపారు. కుటుంబం, బంధువులు, స్నేహితులతో ఆనందంగా గడిపే క్షణాలను ఇలా కరోనా వార్డులోనే గడుపున్నానని.. ఒత్తిడికి గురయ్యానని, శక్తి కోల్పోయానని ఆవేదన చెందారు. అయినా కరోనా అంతం వరకు ఇలాగే పోరాడుతానన్నారు.

‘పని భారంతో ఎన్నో పూటలు భోజనానికి దూరమయ్యాను. కచ్చితమైన షెడ్యూల్‌ లేకపోవడం నా లైఫ్‌స్టైల్‌లో అనేక మార్పులు తీసుకొచ్చింది. వ్యాధితోనే కాదు.. వైద్య సదుపాయాలు లేక ఓ రోగి ఎలా విలవిల్లాడుతాడో చూసి నా కళ్లు తెరుచుకున్నాయి. ఎంతోమంది చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్నారు. అయినవారిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఎందరో పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. మరెందరో తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుతోంది. నా ఆధీనంలోని రోగి మృతిచెందితే నా కుటుంబసభ్యులే మృతిచెందినట్లు బాధ కలిగేది. ఎవరి పరిస్థితైనా విషమించితే అతడి వద్దకు వెళ్లి నవ్వించేందుకు ప్రయత్నించేవాడిని. ఆ కొద్ది క్షణాలైనా అతడిని ఆనందంగా ఉంచాలి అని అనిపించేంది’ అని ఆ వైద్యుడు పలు విషయాలు పంచుకున్నారు.

‘కుటుంబసభ్యులకు అనుమతి లేకపోవడంతో.. ఒంటరిగానే బాధితులు కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతుంటారు. వారిని అలా చూడటం బాధగా ఉండేది. కొందరు నన్ను కౌగిలించుకొని వారి బాధలు, కష్టాలు, కోరికలు చెప్పేవారు. వారిలో కొందరిని కాపాడలేనేమోనని ఎంతో మదనపడేవాడిని. ఇవన్నీ ఒక ఎత్తయితే మృతుల కుటుంబాలకు చేదు వార్త చెప్పడం అత్యంత కష్టమైన పని. ఆ క్షణంలో వారి బాధను చూసి తట్టుకోలేకపోయేవాడిని.’ అని పేర్కొన్నారు. 

మహమ్మారి నుంచి రోగుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తమ శక్తిమేర కృషి చేస్తున్నారని అన్నారు. టీకాలు అందుబాటులోకి రావడం.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుండటంతో మహమ్మారికి ముగింపు పలుకుతామనే ఆశిస్తున్నానన్నారు. నిరంతరం పనిచేస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. బాధితులను కాపాడేందుకు వాటిని లెక్కచేయనని  గర్వంగా తెలిపారు.  ప్రతి వైద్యుడు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. మహమ్మారికి ముగింపు పలికేవరకు ఇలాగే కష్టపడాలని వారికి సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని, సానుకూల దృక్పథంతో ఉండాలని ప్రజలకు సూచించారు. తమను ప్రేమించేవారితో ఎక్కువ సమయం గడపాలన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని