నిషేధానికి ముందే చైనా యాప్‌లకు దెబ్బ

భారత్‌లో నిషేధానికి ముందే చైనా యాప్‌ల వాడకం తగ్గిందని నీల్సన్‌ మీడియా సర్వే తెలిపింది. గల్వాన్‌ లోయలో డ్రాగన్‌తో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైనప్పటి నుంచే తగ్గుదల చోటుచేసుకుందని వెల్లడించింది...

Published : 11 Jul 2020 00:21 IST

గల్వాన్‌ ఘటనతో వాడకం తగ్గించిన భారతీయులు 

ముంబయి: భారత్‌లో నిషేధానికి ముందే చైనా యాప్‌ల వాడకం తగ్గిందని నీల్సన్‌ మీడియా సర్వే తెలిపింది. గల్వాన్‌ లోయలో డ్రాగన్‌తో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైనప్పటి నుంచే తగ్గుదల చోటుచేసుకుందని వెల్లడించింది.

లద్దాఖ్‌ సమీపంలోని గల్వాన్‌ లోయలో జూన్‌ 15న చైనా, భారత సైనికులు బాహాబాహీకి దిగారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చైనాపై ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. దుందుడుకు డ్రాగన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యత, దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లుతోందని 59 చైనీస్‌ యాప్‌లను జూన్‌29న నిషేధించింది.  కాగా గల్వాన్‌ ఘటన నుంచే యాప్‌ల వినియోగం తగ్గిందని నీల్సన్‌ మార్కెట్‌ సర్వే తెలిపింది.

మొబైల్‌ ఫోన్లలో ఈ యాప్‌లను సందర్శించే వారి సంఖ్య జూన్‌ 20తో ముగిసిన వారానికి 5% తగ్గి 77 శాతానికి చేరుకుందని సర్వే తెలిపింది. ఆ తర్వాత 76%కు చేరుకుందని వెల్లడించింది. టైర్‌-1 నగరాల్లో 15-24 ఏళ్ల యువత యాప్‌ల వాడాకాన్ని బాగా తగ్గించింది. ఈ రెండు సెగ్మెంట్లలో 11% తగ్గుదల నమోదైంది. యాప్‌లను సందర్శించే సగటు సెషన్ల సంఖ్య 10% తగ్గింది. జూన్‌ 20తో ముగిసిన వారానికి ఇది 7.4 ఉండగా జూన్‌ 27తో ముగిసిన వారానికి 5.4కు తగ్గిపోయింది. 15-24 ఏళ్ల వయసున్న పురుషుల సైతం యాప్‌లు చూడటం బాగా తగ్గించారు. ఈ సెగ్మెంట్‌లో 18% వరకు తగ్గుదల నమోదైంది. టైర్‌-2 నగరాల్లోనైతే ఏకంగా 20 శాతం తగ్గింది.

ప్రభుత్వం అధికారికంగా నిషేధించడానికి ముందే వివిధ సంస్థలు చేసిన ప్రచారం యాప్‌ల వాడకంపై ప్రభావం చూపిందని నీల్సన్‌ తెలిపింది. ఇక జులై 3తో ముగిసిన వారానికి టీవీ వీక్షణ 1.017 ట్రిలియన్‌ నిమిషాలుగా ఉందని బార్క్‌ తెలిపింది. కొవిడ్‌-19కు ముందున్న నాటితో పోలిస్తే 887 బిలియన్‌ నిమిషాలు ఎక్కువని తెలిపింది. అయితే లాక్‌డౌన్‌లో సాధించిన 1.266 ట్రిలియన్‌ నిమిషాల కన్నా తక్కువే కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని