భూమి కంపించినా బెదరని ప్రధాని!

న్యూజిలాండ్‌లో సోమవారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైంది. ఆ సమయంలో ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న ఆ దేశ ప్రధాని జెసిండా అర్డెర్న్‌ మాత్రం తనదైన శైలిలో కార్యక్రమాన్ని కొనసాగించారు......

Published : 25 May 2020 11:05 IST

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లో సోమవారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైంది. ఆ సమయంలో ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తున్న  ప్రధాని జెసిండా అర్డెర్న్‌ మాత్రం తనదైన శైలిలో కార్యక్రమాన్ని కొనసాగించారు. తానున్న భవనం కుదుపులకు లోనవుతున్నా.. పెద్దగా ఆందోళనకు గురికాలేదు. అయితే.. ఆమె ధీమాకు కారణం లేకపోలేదు లెండి! పార్లమెంటు కాంప్లెక్సులో ఉండే ఆ భవనం భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించారు. ఏదేమైనా భూమి కంపిస్తున్న సమయంలో అంత తేలిగ్గా తీసుకోవడం ఆమెకే చెల్లింది. భూమి కంపించిన సమయంలో వ్యాఖ్యాతకు, ఆమెకు మధ్య సంభాషణ ఇలా సాగింది...

‘‘ర్యాన్‌(వ్యాఖ్యాత).. ఇక్కడ భూమి కంపిస్తోంది. చుట్టూ వస్తువులు కదులుతున్నాయి చూశావా..?’’ గదిలో ఇటుఅటూ చూస్తూ అన్నారు జెసిండా. అనంతరం కొద్దిసేపట్లో ‘‘ఇక ఆగిపోయింది. సురక్షితంగా ఉన్నాం. నాపై ఎలాంటి వేలాడుతున్న విద్యుత్తు దీపాలు లేవు. నేను ఉన్న నిర్మాణం చాలా బలమైందనుకుంటా’’ అని చాలా సాధారణంగా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆమెలో ఎలాంటి భయంగానీ, ఆందోళనగానీ కనిపించలేదు.

సోమవారం ఉదయం సంభవించిన ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల రైళ్లు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. ‘పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్‌లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు తరచూ సంభవిస్తుంటాయి. 2011లో క్రైస్ట్‌చర్చ్‌ నగరంలో భూకంపం 185 మందిని పొట్టనబెట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు