పోలవరం నిధులు విడుదల చేయండి:బుగ్గన

విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి...

Updated : 03 Mar 2020 19:14 IST

దిల్లీ: విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కోరారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులపై చర్చించినట్లు ఆయన తెలిపారు. దిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. పోలవరం పెండింగ్‌ నిధులతో పాటు పౌరసరఫరాల శాఖ నుంచి రావాల్సిన బకాయిలను ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. రెవెన్యూ లోటు, వెనుకబడిన జిల్లాల నిధులు, కడప ఉక్కు కర్మాగారం గురించి ప్రస్తావించామని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి కొంత సడలించాలని కోరామని.. దీనికి నిర్మలా సీతారామన్‌ సానుకూలంగా స్పందించారని బుగ్గన వివరించారు. 

రాష్ట్రానికి రావాల్సిన నిధులపై 15వ ఆర్థికసంఘం ఛైర్మన్‌తో చర్చించామని, జనాభా ఆధారంగా కేటాయిస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వివరించామని బుగ్గన తెలిపారు. మౌలిక వసతుల ప్రాజెక్టులపై నీతిఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌తో మాట్లాడామన్నారు. ‘‘రాష్ట్రంలో తలపెట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు సాయం చేయాలని కోరాం. పన్నుల వసూళ్ల విషయంలో దేశవ్యాప్తంగా పెద్దగా వృద్ధి లేదు. రాష్ట్రంలో పన్ను వసూళ్ల వృద్ధిరేటు మైనస్‌లో మాత్రం లేదు’’ అని బుగ్గన వివరించారు. జీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేస్తామని సీతారామన్‌ చెప్పినట్లు ఆయన వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని