మందడంలో పోలీసులతో మహిళల వాగ్వాదం

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ.. రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 77వ రోజు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు తదితర గ్రామాల్లో రైతులు...

Updated : 03 Mar 2020 15:35 IST

77వ రోజు కొనసాగుతున్న రాజధాని ఆందోళనలు

అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ.. రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 77వ రోజు కొనసాగుతున్నాయి. మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రైతుల దీక్షలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. మందడంలో రైతుల ధర్నాకు కృష్ణా జిల్లా కొండపల్లి, ప్రసాదంపాడు మహిళలు మద్దతు తెలిపారు. రైతులతోపాటు దీక్షా శిబిరంలో కూర్చుని ఆందోళనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. 

మరోవైపు ఇవాళ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సచివాలయానికి వెళ్లడంతో మందడంలో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద నెట్లు పట్టుకుని పహారా కాశారు.  మందడం దీక్షా శిబిరంపై ఆంక్షలు విధించారు. కొత్తగా ఏర్పాటు చేసిన శిబిరంలో రైతులు ఆందోళన చేసేందుకు అనుమతివ్వలేదు. ఈ క్రమంలో పోలీసులకు మహిళలకు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రైవేటు స్థలంలో ఆందోళన చేస్తుంటే పోలీసుల అభ్యంతర మేంటని మహిళలు నిలదీశారు. ఎవరెంత రెచ్చకొడుతున్నా గత 76 రోజులుగా శాంతియుతంగానే ఆందోళనలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పాలకులు మా గోడు వినాలనే ఇన్ని రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని.. అలాంటిది పాలకులకు కనపడకూడదని ఆంక్షలు విధించడం సరికాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కుల కోసమే ఈ పోరాటమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షా శిబిరాన్ని ఖాళీ చేసేది లేదని వారు తేల్చి చెప్పారు. అదేవిధంగా అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు తమ పోరాటం ఆగదని రైతులు స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని