ముగిసిన తెలంగాణ కేబినెట్‌ భేటీ

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. సుమారు 6 గంటల పాటు జరిగిన భేటీలో వివిధ అంశాలపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. 

Updated : 24 Sep 2022 15:25 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. సుమారు 6 గంటల పాటు జరిగిన భేటీలో వివిధ అంశాలపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రద్దు కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దేశపౌరసత్వం ఇచ్చే విషయంలో మత వివక్ష ఉండరాదని మంత్రివర్గం పేర్కొంది. కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బంగా తరహాలో తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు పట్టణప్రగతి కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.  ఈ నెల 18న ప్రగతిభవన్‌లో రాష్ట్రస్థాయి పురపాలక సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో పట్టణప్రగతి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పురపాలక సదస్సుకు మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈ సదస్సుకు వచ్చేవారందరినీ గజ్వేల్‌ సందర్శనకు పంపించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించాలని నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాలకు నెలకు రూ.148 కోట్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.311 కోట్లు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. లోకాయుక్త చట్టసవరణ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బడ్జెట్‌ సమావేశాల్లో లోకాయుక్త బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అభయహస్తం పథకం సమీక్ష బాధ్యతను మంత్రి హారీశ్‌రావుకు అప్పగించారు. రాజీవ్‌ స్వగృహ ఇళ్లను వేలం ద్వారా విక్రయించాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. విధివిధానాల ఖరారుకు కమిటీని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని