బక్కచిక్కిపోయిన మృగరాజులు..!

ఖర్టోమ్‌: అడవికి రారాజు సింహం అంటారు. ఒక్కసారి జూలు విదిల్చి పంజా వేసిందంటే ఇక అంతే సంగతులు. ఎంత పెద్ద జంతువైనా ప్రాణాలు కోల్పోవలసిందే. బలిష్టమైన శరీరం.. జూలుతో అందరినీ భయపెట్టే విధంగా ఉండే సింహాలు ఇక్కడ మాత్రం ఎముకల గూడుతో బక్కచిక్కిపోయి ఉన్నాయి. కళ్లలో జ

Updated : 23 Jan 2020 16:45 IST

ఖర్టోమ్‌: అడవికి రారాజు సింహం అంటారు. ఒక్కసారి జూలు విదిల్చి పంజా వేసిందంటే ఇక అంతే సంగతులు. ఎంత పెద్ద జంతువైనా ప్రాణాలు కోల్పోవలసిందే. బలిష్టమైన శరీరం.. జూలుతో అందరినీ భయపెట్టే విధంగా ఉండే సింహాలు ఇక్కడ మాత్రం ఎముకల గూడుతో బక్కచిక్కిపోయి ఉన్నాయి. కళ్లలో జీవం లేకుండా కనీసం నడవడానికి కూడా ఓపికలేని పరిస్థితిలో ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఎవరికైనా హృదయం కలిచివేయకమానదు. సూడాన్‌ రాజధాని ఖర్టోమ్‌లోని అల్‌ ఖురేషీ జంతు ప్రదర్శన శాలలో ఉన్న సింహాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. 

తినేందుకు ఆహారం కూడా లేక ఆకలితో అలమటిస్తున్నాయి. కనీసం నడవడానికి కూడా ఓపిక లేక ఒక చోట కదలకుండా కూర్చున్న వాటిని చూసి జంతు ప్రేమికులు తల్లడిల్లుతున్నారు. ఈ జంతు ప్రదర్శనశాలలో మొత్తం ఐదు సింహాలు ఉండగా అందులో ఇటీవల రెండు మృతి చెందాయి. ఇక మూడు సింహాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సూడాన్‌లో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొనడటంతో పార్క్‌లో ఉన్న సింహాలకు ఆహారం కూడా దొరకడం లేదు. దీంతో అవి సగానికిపైగా బరువు తగ్గిపోయాయి. దీనిపై జూ నిర్వాహకులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కేవలం మంచినీళ్లు తాగి అవి వాటి కడుపు నింపుకుంటున్నాయి. కొన్ని వారాలుగా అవి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నాయి. సొంత డబ్బుతో తాము వాటికి ఆహారం ఏర్పాటు చేసినా అది సింహాలకు సరిపోవడం లేదని జూ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్‌లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటున్నాయి. దీంతో మృగరాజులకు తినేందుకు ఆహారం కూడా లభించడం లేదు. సింహాల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయిన ఓ వ్యక్తి వీటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి. కొంతమంది వాటి కోసం మాంసం, అవసరమైన మందులు తీసుకొని ఆ పార్క్‌కు వస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని