GHMC: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ కుటుంబానికి రూ.5లక్షల పరిహారం 

మణికొండలో మరమ్మతులో ఉన్న నాలాలో పడి మృతి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు మణికొండ మున్సిపాలిటీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌...

Updated : 28 Sep 2021 21:47 IST

హైదరాబాద్‌: మణికొండలో మరమ్మతులో ఉన్న నాలాలో పడి మృతి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు మణికొండ మున్సిపాలిటీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ వితోబాను సస్పెండ్‌ చేశారు. దీంతో పాటు మరమ్మతులు జరుగుతున్న సమయంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు, చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించిన గుత్తేదారు రాజ్‌కుమార్‌పై నార్సింగ్‌ పోలీసులు కేసునమోదు చేశారు.  

పెరుగు ప్యాకెట్‌ కోసం వెళ్లి మృత్యు ఒడికి..

మణికొండ గోల్డెన్‌టెంపుల్‌ వద్ద నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో పడి గల్లంతైన ఐటీ ఉద్యోగి గోపిశెట్టి రజనీకాంత్‌(42) మృతదేహం నెక్నాంపూర్‌ చెరువులో గుర్తించారు. భార్య స్వప్న ప్రైవేటు ఉద్యోగి. ఇద్దరు పిల్లలున్నారు. రాంనగర్‌కు చెందిన రజనీకాంత్‌, స్వప్న దంపతులు ఆరేళ్ల క్రితం మణికొండ పరిధి సెక్రటేరియేట్‌ కాలనీలోని బాబానివాస్‌ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాటు కొనుగోలు చేసి అక్కడే ఉంటున్నారు. షాద్‌నగర్‌ వద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థలో రజనీకాంత్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో బయటకు వెళ్లిన రజనీకాంత్‌ కొద్ది సమయానికే ఇల్లు చేరారు. 9 గంటల సమయంలో మరోసారి పెరుగు కోసం బయటకు వచ్చారు. పెరుగు ప్యాకెట్‌ తీసుకుని ఇల్లు చేరేందుకు బయల్దేరారు. రాత్రి 9.14 గంటల సమయంలో గోల్డెన్‌టెంపుల్‌ ఎదురుగా ఉన్న డ్రైనేజీ మీద ఉన్న మార్గం మీదుగా వెళ్తూ మురుగుకాల్వలో పడిపోయారు. అప్పటికే అక్కడ భారీగా వరదచేరటంతో కాల్వలో కొట్టుకుపోయారు. సమీపంలోని చారి అనే వ్యక్తి వరదను చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాద ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో నాలాలు కలిసే నెక్నాంపూర్‌ చెరువులో ఆదివారం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. మూడోరోజు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నెక్నెంపూర్‌ చెరువులో గుర్రపుడెక్క తొలగిస్తుండగా రజనీకాంత్‌ మృతదేహం బయటపడింది.

నీలిరంగు చొక్కా ఆధారం

డ్రైనేజి మ్యాన్‌హోల్‌లో గల్లంతైన వ్యక్తి ధరించిన దుస్తుల ఆధారంగా రజినీకాంత్‌గా అనుమానించారు. వీడియోలో అతని ముఖం స్పష్టంగా కనిపించక పోవడంతో అతనే అని నిర్ధారించేందుకు నిరాకరించారు. సోమవారం మధ్యాహ్నం మృతదేహం గుర్తించిన అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. 42 గంటల పాటు నీటిలోనే ఉండటంతో ముఖం గుర్తుపట్టలేనంతగా మారింది. నీలి రంగు చొక్కా ఆధారంగా రజనీకాంత్‌ అని నిర్ధారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని