కొత్త రెవెన్యూ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

తెలంగాణ కేబినెట్‌ భేటీ ముగిసింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై మంత్రులతో సీఎం

Updated : 07 Sep 2020 23:05 IST

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ భేటీ ముగిసింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం కొత్త రెవెన్యూ బిల్లుతో పాటు రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు, టీఎస్‌ బీపాస్‌, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం-2019 సవరణ, తెలంగాణ జీఎస్టీ చట్టం-2017, తెలంగాణ సివిల్‌ కోర్టు చట్టం-1972 బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వీటితో పాటు తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం సవరణ ఆర్డినెన్స్‌-2020, తెలంగాణ డిజాస్టర్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్‌-2020, తెలంగాణ ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్ మేనేజ్‌మెంట్‌ బిల్లు-2020లకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. 

ఆయుష్ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్‌ను కేబినెట్‌ ఆమోదించింది. తెలంగాణ కోర్టు ఫీజు, సూట్స్‌ వాల్యుయేషన్‌ చట్టం-1956 సవరణ బిల్లుతో పాటు కొత్త సచివాలయ నిర్మాణం, పాత సచివాలయం కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులతో పాటు 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలంటూ బీసీ కమిషన్‌ చేసిన సిఫార్సులకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. మరోవైపు శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపైనా మంత్రులతో సీఎం కేసీఆర్‌ చర్చించారు.

శ్రీరామ చంద్రమౌళికి కాళోజీ అవార్డు

ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు-2020 అవార్డుకు శ్రీరామా చంద్రమౌళి ఎంపికయ్యారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. వరంగల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి పదవీ విరమణ పొందిన శ్రీరామా చంద్రమౌళి కవిగా, రచయితగా, నవలాకారుడిగా ప్రసిద్ధి పొందారు. దీపశిఖ, స్మృతిధార,అంతర్ధహనం, అసంపూర్ణ, అంతర తదితర రచనలు చేశారు. ఈయన కాలనాళిక నవలలో తెలంగాణ ఉద్యమ పరిణామాన్ని సృజనాత్మకంగా ఆవిష్కరించారు.   

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని