INPICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

Published : 05 Sep 2020 22:28 IST

ఈ చిత్రాన్ని చూస్తుంటే సినిమా షూటింగ్‌లా అనిపిస్తోంది కదూ! అలా అనుకుంటే మీరు పొరబడినట్లే. వారంతా ఆక్టోపస్‌ పోలీసులు. హైదరాబాద్‌ నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలను అత్యాధునిక కెమెరాలతో 360 డిగ్రీల కోణంలో చిత్రీకరిస్తున్నారు. భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు జరిగితే వేగంగా, సులువుగా ప్రజలను కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నెక్లెస్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ గార్డెన్‌ వద్ద తీసిన చిత్రమిది. 


గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. గుంటూరు మహిళా ప్రాంగణంలో ఆర్డీవో భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులు అభ్యర్థులను ప్రశ్నలు అడిగారు. కొవిడ్‌ నిబంధనలు మేరకు అభ్యర్థులు, కమిటీ సభ్యులు మధ్య ప్లాస్టిక్‌
తెరను ఏర్పాటు చేశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు అభ్యర్థులు తెర చాటు నుంచే సమాధానాలు చెప్పారు. 


వృద్ధాప్య పింఛను తీసుకునే ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పింఛన్‌ అందుకోవాలంటే కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలని గ్రామాల్లో వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. దీంతో తమకు పింఛన్‌ రాదనే భయంతో కష్టమైనా తప్పనిసరి పరిస్థితుల్లో కొవిడ్‌ పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. గుంటూరు పాత బస్టాండ్‌ సమీపంలోని ఉర్దూ పాఠశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ పరీక్షా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న వృద్ధులను చిత్రంలో చూడొచ్చు.


ఆస్ట్రియాకు చెందిన ఐస్‌ స్విమ్మర్‌ జోసెఫ్‌ కోబ్లెర్‌ మంచు గడ్డల మధ్య ఎక్కువ సమయం ఉన్న వ్యక్తిగా ప్రపంచ రికార్డు సృష్టించారు. శనివారం ఆస్ట్రియాలోని మెల్క్‌ నగరంలో ఓ గాజు పెట్టెలో నిలబడి దాని నిండా ఐస్‌ ముక్కలు పోయించుకున్నాడు. రెండు గంటలపాటు పెట్టెలో నిల్చున్నాడు. గతంలో చైనా క్రీడాకారుడు నెలకొల్పిన గంటా 53 నిమిషాల రికార్డును జోసెప్‌ కోబ్లెర్‌ బద్దలుకొట్టాడు. పోటీలో గెలిచిన అనంతరం కోబ్లెర్‌ ఐస్‌క్రీమ్‌ తినడం చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని