INPICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

Updated : 04 Sep 2020 20:06 IST

తరగతి గదిలో విద్యార్థులకు బదులుగా కోళ్లు కనిపిస్తున్నాయి ఏంటా అనుకుంటున్నారా..? కొవిడ్‌ కారణంగా కెన్యాలో దేశవ్యాప్తంగా పాఠశాలలను వచ్చే జనవరి వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు తమ మనుగడ కోసం తరగతి గదుల్లో కోళ్లను పెంచుతున్నాయి. పాఠశాలల మూసివేతతో కోల్పోయిన ఆదాయంలో కొంత భాగాన్ని ఈ విధంగా భర్తీ చేసుకుంటున్నాయి.


చంకలో బిడ్డను పెట్టుకొని చూస్తున్న ఈ చింపాంజీ పేరు మాండీ. దీని వయస్సు 43 ఏళ్లు.  ఇంగ్లాండ్‌ మాంచెస్టర్ జూలో ఉండే ఈ చింపాంజీ ఆగస్టు 21న ప్రసవించింది. ఇప్పటికే మాండీ కుటుంబంలో కుమార్తె, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. మాండీకి ఓ బిడ్డ జన్మించడం పట్ల జూ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వేగంగా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఆఫ్రికా చింపాంజీ కూడా ఉంది.


తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇటీవల చేపట్టిన నిరసనల్లో కొందరు నిరసనకారులు ప్రగతి భవన్‌  గోడలు ఎక్కి ఆందోళన చేశారు. దీంతో గోడలు ఎక్కకుండా చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. 


తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 15 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన ముసురుమిల్లి ప్రాజెక్టు పనులు నేటికీ పూర్తి కాలేదు. రంపచోడవరం మండలం ముసురుమిల్లి వద్ద సీతపల్లి వాగుపై దీన్ని నిర్మిస్తున్నారు. దీని ద్వారా 22 వేల ఎకరాలకు సాగునీరుతో పాటు అయిదు మండలాల ప్రజలకు తాగునీరు అందుతుంది. ముసురుమిల్లి ప్రాజెక్టు నిర్మాణం 90 శాతం పూర్తయినా మిగిలిన పది శాతం పనులు పూర్తి కాకపోవడంతో వర్షాలు, ఇతర వనరుల ద్వారా వచ్చిన నీరు వృధాగా పోతుంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 


లాక్‌డౌన్‌ అనంతరం తొలిసారి విశాఖలో సినిమా షూటింగ్‌ శుక్రవారం జరిగింది. ‘ఐపీఎల్‌’ పేరుతో రూపొందిస్తున్న సినిమాలో పాటను సాగరతీరంలోని ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలో చిత్రీకరించారు. 


 

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం పెద్దబారంగిలో రైతులు ఐటీడీఏ ఆధ్వర్యంలో జీడి మామిడి తోటలను సాగు చేస్తున్నారు. పశువులు, కోతుల బారి నుంచి మొక్కలను రక్షించేందుకు వినూత్న ఆలోచన చేశారు. మొక్క చుట్టూ నాలుగు కర్రలు పాతి దాని చుట్టూ రంగు రంగుల వస్త్రాలను రక్షణగా కట్టారు. ఆ మార్గంలో వెళ్లే వారిని ఆకట్టుకొంటున్నాయి రంగు రంగుల రక్షణ కంచెలు.


రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ సొంత నిధులతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవనంపై ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చిత్రం చూపరులను ఆకట్టుకుంటోంది.


రోడ్డు పక్కన వెళ్తున్న ఉడుతను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన గద్ద విఫలమైంది. గద్ద రాకను పసిగట్టిన ఉడుత మెరుపు వేగంతో తప్పించుకుని పారిపోయింది. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన చిత్రాలివి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని