Honey trap: వలపు వలతో 300 మందికి టోకరా

యువకులను టార్గెట్‌ చేస్తూ.. వలపు వల(హనీ ట్రాప్‌) విసురుతారు. నగ్నంగా వీడియో కాల్స్‌ చేస్తారు.

Published : 25 Oct 2021 13:41 IST

యూపీలో కిలాడీ దంపతుల అరెస్టు 

గాజియాబాద్‌: యువకులను టార్గెట్‌ చేస్తూ.. వలపు వల(హనీ ట్రాప్‌) విసురుతారు. నగ్నంగా వీడియో కాల్స్‌ చేస్తారు. అవతలి వారితోనూ నగ్నంగా మాట్లాడిస్తారు. ఆ వీడియోలు రికార్డు చేసి అడిగినంత ఇవ్వకపోతే ఇంటర్నెట్‌లో పెడతామని బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. ఇలా 300 మందిని మోసగించి.. రూ.20 కోట్లకు పైగా వసూలు చేసిందో ముఠా. పరువుకు భయపడి బాధితులు ఫిర్యాదు చేయకపోయినా.. ఓ చిన్న కేసులో భాగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ మోసాన్ని గుట్టురట్టు చేశారు. భార్యాభర్తలు సహా ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. యూపీలోని గాజియాబాద్‌కు చెందిన భార్యాభర్తలైన సప్నా గౌతమ్, యోగేశ్‌ ఈ కేసులో ప్రధాన నిందితులు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఈ తరహా మోసాలకు తెరతీశారు. ఈ జంటకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు ఈ తరహా మోసాలు ప్రారంభించారు. బాధితులతో వీడియో కాల్స్‌ మాట్లాడడం, మరికొందరు యువతులకు శిక్షణ ఇచ్చి వారిచేత కూడా ఇవే పనులు చేయించడం సప్నా పని. బాధితుల వివరాలు, వారి ప్రదేశం, ఫోన్‌ నంబర్, బ్యాంకు ఖాతాలను యోగేశ్‌ సేకరిస్తుంటాడు. హనీ ట్రాప్‌ చేస్తున్న ముఠాతొలుత ఓ అడల్ట్‌ వెబ్‌సైట్‌లో ఈ ముఠా సభ్యులు పేరు నమోదు చేసుకుంటారు. కొత్త కొత్త ఐడీలతో నగ్నంగా వీడియోకాల్స్‌ చేస్తారు. ఇందుకు నిమిషానికి రూ.234 చెల్లించాలి. ఇందులో సగభాగం వెబ్‌సైట్‌ నిర్వాహకులకు, మిగిలిన సగం వీరికి చేరుతుంటుంది.

ఇంతకంటే తక్కువ మొత్తానికి తాము వీడియోలో అందుబాటులో ఉంటామంటూ బాధితుల నుంచి వీరు ఫోన్‌ నంబర్లు సేకరిస్తారు. నేరుగా వారికే వాట్సప్, ఇతర మాధ్యమాల ద్వారా వీడియో కాల్స్‌ చేస్తారు. అవతలివారిని కూడా నగ్నంగా మాట్లాడమని సూచిస్తారు. అనంతరం అవతలి వ్యక్తి వీడియోలను రికార్డు చేస్తారు. వారి ఫోన్‌ నంబర్‌కు వీడియోలు పంపించి, అడిగిన మొత్తం చెల్లించాలని డిమాండ్‌ చేస్తారు. దాదాపు 300 మంది దగ్గర రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ సీఏ కంపెనీ యజమాని ఫిర్యాదుతో ఈ వ్యవహారం బట్టబయలైంది. తన కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి రూ.80 లక్షలను కంపెనీ ఖాతా నుం చి బదిలీ చేసినట్లు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా వారు గాజియాబాద్‌ పోలీసులను ఆశ్రయించడంతో తీగ లాగితే డొంక కదిలింది. మోసాలకు పాల్పడుతున్న భార్యాభర్తలు సహా, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని