Pune girl brutal murder: నడిరోడ్డుపై బాలిక హత్య.. మానవత్వానికే సిగ్గుచేటు: అజిత్‌ పవార్

మహారాష్ట్రలోని పుణెలో 14 ఏళ్ల బాలికను నడిరోడ్డుపై కిరాతకంగా పొడిచి చంపిన ఘటనలో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు

Published : 14 Oct 2021 02:18 IST

పుణె: మహారాష్ట్రలోని పుణెలో 14 ఏళ్ల బాలికను నడిరోడ్డుపై కిరాతకంగా పొడిచి చంపిన ఘటనలో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమించడం లేదని కక్ష పెంచుకొని 22ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ బాలికను పలుమార్లు పొడిచి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడితో సహా మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణె పట్టణంలోని బిబేవాడీ ప్రాంతంలో 8వ తరగతి చదివే బాలిక సాయంత్రం పూట కబడ్డీ ప్రాక్టీసుకు వెళ్తుండగా నలుగురు యువకులు బైకుపై వచ్చి దాడి చేశారు. ఇద్దరు బైకుపై ఉండగా మరో ఇద్దరు పదునైన ఆయుధంతో బాలిక గొంతు, ఇతర శరీర భాగాలపై దారుణంగా పొడిచారు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి 22 ఏళ్ల యువకుడు, బాలికకు దగ్గర బంధువైన శుభమ్ భగవత్‌ను, మరో ముగ్గురిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, ఈ క్రూరమైన ఘటనను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తీవ్రంగా ఖండించారు. నడిరోడ్డుపై బాలిక హత్య అందర్నీ సిగ్గుతో తల దించుకునేలా చేసిందని.. ఇది మానవత్వానికే సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని