రూ.3వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం!

అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్‌ రాకెట్‌ను భారత నావికాదళం చేధించింది. దాదాపు రూ.3వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది.

Updated : 20 Apr 2021 10:22 IST

అరేబియా తీరంలో పట్టుకున్న భారత నేవి

దిల్లీ: అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్‌ రాకెట్‌ను భారత నావికాదళం ఛేదించింది. దాదాపు రూ.3వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు శ్రీలంక పౌరులను అరెస్టు చేసినట్లు భారత నేవీ అధికారులు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో ఇంతటి విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం తొలిసారని అధికారులు పేర్కొన్నారు.

అరేబియా సముద్రంలో ‘సువర్ణ’ నౌకలో గస్తీ నిర్వహిస్తోన్న భారత నావికా దళ సిబ్బంది అనుమానాస్పదంగా తిరుగుతోన్న ఓ పడవ కనిపించింది. పాకిస్థాన్‌ నుంచి వచ్చినట్లు భావిస్తోన్న ఆ నౌక తర్వాత కొచ్చి తీరానికి చేరుకుంది. అదే సమయంలో అనుమానం వచ్చిన భారత నేవీ సిబ్బంది పడవపై దాడి చేసి గాలించారు. అందులో దాదాపు 300కిలోల మాదకద్రవ్యాలను గుర్తించారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.3వేల కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఐదుగురిని అరెస్టు చేసిన అధికారులు వారిని విచారిస్తున్నారు. పాకిస్థాన్‌లోని మాక్రాన్‌ తీరం నుంచి భారత్‌, మాల్దీవులు, శ్రీలంక కేంద్రాలుగా ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సాగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అరెస్టు చేసిన వారిని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ), సథరన్‌ నావెల్‌ కమాండ్‌తో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు కలిసి విచారిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఇంతటి భారీ స్థాయిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా గతంలోనూ వెలుగుచూసింది. ఈ అక్రమ వ్యాపారం భారత్‌కు రెండు వైపులా వేళ్లూనుకుంది. ఒక వైపు అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌-ఇరాన్‌లతో కూడిన బంగారు నెలవంక (అంతర్జాతీయంగా దీనికి ఉన్న పేరు) ద్వారా, మరోవైపు బర్మా-లావోస్‌-థాయిల్యాండ్‌తో కూడిన బంగారు త్రికోణంలో జరుగుతున్నాయి. ఇంతకుముందు ముంబయిలో పట్టుకొన్న రూ.1,000 కోట్ల విలువైన హెరాయిన్‌ అఫ్గానిస్థాన్ మీదుగా ఇరాన్‌ వచ్చి అక్కడి నుంచి భారత్‌ పోర్టుకు చేరినట్లు అధికారులు గుర్తించారు. భూ, జల మార్గాలను ఉపయోగించుకొని స్మగ్లర్లు వీటిని భారత్‌తో పాటు పలు దేశాలకు చేరుస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని