మహిళ అనీ చూడలేదు.. చెట్టుకు కట్టేసి..!

ఆమెకు 19 ఏళ్లు.. మూడు నెలల క్రితమే పెళ్లయింది. మెట్టింట్లో ఏమైందో ఏమో.. కన్నవారు ఉన్నారన్న ధైర్యంతో పుట్టింటికి వచ్చింది. చేరదీయాల్సిన బంధువులే రాబందుల్లా మారారు. అత్యంత కిరాతకంగా జుట్టుపట్టి ఈడ్చి ఈడ్చి కొట్టారు...

Published : 03 Jul 2021 01:07 IST

భోపాల్‌: ఆమెకు 19 ఏళ్లు. మూడు నెలల క్రితమే పెళ్లయింది. మెట్టింట్లో ఏమైందో ఏమో.. కన్నవారు ఉన్నారన్న ధైర్యంతో పుట్టింటికి వచ్చింది. చేరదీయాల్సిన బంధువులే రాబందుల్లా మారారు. అత్యంత కిరాతకంగా జుట్టుపట్టి ఈడ్చి ఈడ్చి కొట్టారు. కర్ర విరిగేంత వరకు గొడ్డును బాదినట్లు బాదారు. అక్కడితోనూ ఆగలేదు. చెట్టుకు కట్టేసి పాశవిక ఆనందం పొందారు. తల్లిదండ్రులు, చిన్నాన్నలు, పెదనాన్నల కళ్లెదుటే ఇంత జరుగుతున్నా వారంతా మౌనంగా ఉండిపోవడం గమనార్హం. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. బాధితురాలు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినదిగా సమాచారం.

మూడు నెలల క్రితం బాధిత మహిళకు ఆలీరాజ్‌పూర్‌నకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ, గత నెల 28న ఆమె పుట్టింటికి వచ్చేసింది. దీంతో కోపోధ్రిక్తులైన కుటుంబీకులు ఆమెను విచక్షణా రహితంగా హింసించారు. ‘ఇంకెప్పుడైనా ఇలా వచ్చేస్తావా?’ అంటూ కర్ర విరిగిపోయేదాకా చావబాదారు. ఈ ఘటనను అక్కడున్న కొందరు మొబైల్స్‌లో రికార్డు చేశారు. అది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో స్థానిక పోలీసులు స్పందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె తండ్రి, కొందరు బంధువులపై కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని