Andhra News: కాటేసిన కరెంటు

కూలి పనులకు వెళుతున్న మహిళలను మృత్యువు కబళించింది. వారు ప్రయాణిస్తున్న ఆటోపై అనూహ్యంగా విద్యుత్తు తీగ తెగిపడి రెప్పపాటులో

Updated : 01 Jul 2022 07:11 IST

ఐదు నిండు ప్రాణాలు బుగ్గి

శ్రీసత్యసాయి జిల్లాలో ఘోరం

ఆటోపై తెగిపడిన విద్యుత్తు తీగ

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, తాడిమర్రి: కూలి పనులకు వెళుతున్న మహిళలను మృత్యువు కబళించింది. వారు ప్రయాణిస్తున్న ఆటోపై అనూహ్యంగా విద్యుత్తు తీగ తెగిపడి రెప్పపాటులో ఐదుగురు బుగ్గి పాలయ్యారు. ఇంటినుంచి బయలుదేరిన పది నిమిషాల వ్యవధిలోనే సజీవ దహనమయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. ఐదుగురు మరణించడంతో పాటు ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్‌, మరో ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన మహిళ కుమారికి చెందిన వేరుసెనగ చేనులో కలుపు తీయడానికి గురువారం ఉదయం గుడ్డంపల్లికి చెందిన కూలీలు రెండు ఆటోల్లో బయలుదేరారు. చిల్లకొండయ్యపల్లి గ్రామం దాటి పొలం దారిలో వంద మీటర్లు వెళ్లగానే విద్యుత్తు స్తంభం నుంచి తీగ తెగి వెనకాల వెళుతున్న ఆటోపై పడింది. ఆటోపై ఉన్న ఇనుప మంచెకు తీగ తగిలి విద్యుదాఘాతమేర్పడింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్‌తో కలిపి 13 మంది ఉన్నారు. డ్రైవర్‌ పోతులయ్యతోపాటు ఎనిమిది మంది మహిళలు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఐదుగురు మహిళలు మంటల్లో చిక్కుకున్నారు. ఇద్దరు పూర్తిగా కాలిపోగా, ముగ్గురి శరీరాలు సగం బూడిదయ్యాయి.

క్షణాల్లో బుగ్గి
ప్రమాదంలో పెద్దకోట్లకు చెందిన పొలం యజమాని కుమారి (35), గుడ్డంపల్లికి చెందిన రత్నమ్మ (40), లక్ష్మీదేవి (36), కాంతమ్మ (45), రామలక్ష్మి (30) అక్కడికక్కడే చనిపోయారు. అదే గ్రామానికి చెందిన యువతి గాయత్రి తీవ్రంగా గాయపడింది. ఆటోలో మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్‌ పోతులయ్య పరిగెత్తుకెళ్లి చిల్లకొండయ్యపల్లి గ్రామస్థులకు సమాచారమిచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకున్నా విద్యుత్తు సరఫరా ఉండటంతో ఆటో వద్దకు వెళ్లడానికి తొలుత భయపడ్డారు. విద్యుత్తు అధికారులకు ఫోన్‌ చేసి సరఫరా నిలిపేయించారు. తాడిమర్రిలోని పెట్రోలుబంకు నుంచి మంటలార్పే గ్యాస్‌ సిలిండర్లను తీసుకొచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గాయత్రిని అనంతపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి బెంగళూరుకు తీసుకెళ్లారు. మృతదేహాలకు ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి.

సీఎం దిగ్భ్రాంతి.. రూ.10 లక్షల చొప్పున పరిహారం
విద్యుదాఘాతమై ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల, బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్యారిస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ప్రమాద ఘటన వివరాల్ని అధికారులు తెలియజేసినట్టు సీఎం కార్యాలయం ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5లక్షల సాయం ప్రకటించారు. వారికి ఏపీఎస్పీడీసీఎల్‌ రూ.5లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తామని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరనాథరావు తెలిపారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు
ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆటోపై విద్యుత్తు హైటెన్షన్‌ తీగలు తెగిపడిన ఘటనలో అయిదుగురు వ్యవసాయ కూలీలు ప్రాణాలు కోల్పోవడంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: పవన్‌కల్యాణ్‌
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హైటెన్షన్‌ విద్యుత్తు తీగలు తెగిపడి ఐదు నిండు ప్రాణాలు బలయ్యాయని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రమాదం ఆవేదన కలిగించింది. విద్యుత్తు ఛార్జీలు పెంచడంపై చూపే శ్రద్ధ లైన్ల నిర్వహణపైనా చూపాలి. ఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపించాలి’ అని కోరారు.


ఉడతపై నెపం

చిల్లకొండయ్యపల్లి వద్ద ప్రమాదానికి ఓ ఉడత కారణమని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు. కరెంటు స్తంభం పైకి ఉడత ఎక్కినప్పుడు ఇన్సులేటర్‌ నుంచి కండక్టర్‌కు షార్ట్‌సర్క్యూట్‌ అయి మధ్యలో తీగ తెగి అదే సమయంలో అటుగా వస్తున్న ఆటోపై పడిందని ఎస్పీడీసీఎల్‌ అధికారులు పేర్కొంటున్నారు. అయితే స్థానిక రైతులు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. తీగలు, బుడ్డీలు (ఇన్సులేటర్లు) నాసిరకంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. గ్రామ పరిధిలోని పొలాల్లో 6నెలల కిందటే 11 కేవీ లైను ఏర్పాటుచేశారు. ఇందులో ఎల్టీ (లోటెన్షన్‌) తీగలు వాడారని రైతులు చెబుతున్నారు. పాత విద్యుత్తు తీగలు లాగుతుండటంపై గుత్తేదారులను ప్రశ్నించినా లెక్క చేయలేదని వాపోతున్నారు. నాసిరకం తీగలను మార్చాలని విద్యుత్తు అధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వివరిస్తున్నారు. అధికారులు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రమాదానికి ఉడతే కారణమని చెబుతున్నారని విమర్శిస్తున్నారు.

నిపుణులేం చెబుతున్నారంటే? 

విద్యుత్తు స్తంభాలపై పక్షులు వాలటం, ఉడత, తొండలాంటి ప్రాణులు ఎక్కటం సాధారణమే. ఉడతలాంటివి తీగలపైకి ఎక్కినప్పుడు షార్ట్‌సర్క్యూట్‌ అయితే సంబంధిత సబ్‌స్టేషన్‌లో ట్రిప్‌ అయి సరఫరా నిలిచిపోతుందని నిపుణులు చెబుతున్నారు. తీగ తెగిపడినా ట్రిప్‌ అవుతుందని, ఇందుకోసం ప్రతి ఫీడర్‌లో ప్రత్యేకంగా బ్రేకర్లను ఏర్పాటుచేస్తారని పేర్కొంటున్నారు. అయితే చిల్లకొండయ్యపల్లి ప్రమాద సంఘటనలో ఉడత కారణంగా షార్ట్‌సర్క్యూట్‌ అయి తీగ తెగింది. ట్రిప్‌ అయి సరఫరా నిలిచిపోలేదు. తీగ తెగినప్పుడు కరెంటు పోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇన్సులేటర్లు, కండక్టర్లు, తీగలు నాసిరకంగా ఉండటం వల్లే ట్రిప్‌ అవ్వలేదని అభిప్రాయపడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని