Crime news: కిలాడీ కపుల్‌: 300 మందికి హనీట్రాప్‌.. ₹20 కోట్లకు టోపీ!

నగ్నంగా వీడియో కాల్స్‌ చేస్తారు. అవతలి వారిని రెచ్చగొడతారు. తర్వాత వీడియోలు రికార్డు చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరిస్తారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 300 మందిని మోసగించారు.

Published : 25 Oct 2021 01:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నగ్నంగా వీడియో కాల్స్‌ చేస్తారు. అవతలి వారిని రెచ్చగొడతారు.వారిని నగ్నంగా మాట్లాడమని కవ్విస్తారు. తర్వాత వీడియోలు రికార్డు చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరిస్తారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 300 మందిని మోసగించారు. దాదాపు రూ.20 కోట్లకు పైగా వసూలు చేశారు. పరువుపోతుందని భావించిన బాధితులూ మిన్నకుండిపోయినా.. ఓ చిన్న కేసులో తీగలాగితే ఈ డొంక కదిలింది. ఏడాదికి పైగా దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ మోసాన్ని పోలీసులు తాజాగా గుట్టురట్టు చేశారు. ఈ కేసులో భార్యాభర్తలు సహా ఐదుగురిని తాజాగా ఘాజియాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా ఈ కేసు వివరాలను పోలీసులు బయటపెట్టారు.

యూపీలోని ఘాజియాబాద్‌కు చెందిన భార్యాభర్తలైన సప్నా గౌతమ్‌, యోగేశ్‌ ఈ కేసులో ప్రధాన నిందితులు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఈ తరహా మోసాలకు తెరతీశారు. ఈ జంటకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు ఈ మోసాలు ప్రారంభించారు. ఈ మోసంలో ఒక్కొక్కరిదీ ఒక్కో పాత్ర. బాధితులతో వీడియో కాల్స్‌ మాట్లాడడం, మరికొందరి యువతులకు శిక్షణ ఇచ్చి వారిచేత కూడా ఇవే పనులు చేయడం సప్నా పని. బాధితుల వివరాలు, వారి ప్రదేశం, ఫోన్‌ నంబర్‌, బ్యాంకు ఖాతాలను యోగేశ్‌ సేకరిస్తుంటాడు.

తొలుత ఓ అడల్ట్‌ వెబ్‌సైట్‌లో ఈ ముఠా సభ్యులు పేరు నమోదు చేసుకుంటారు. కొత్త కొత్త ఐడీలతో నగ్నంగా వీడియోకాల్స్‌ చేస్తారు. ఇందుకు నిమిషానికి రూ.234 చెల్లించాలి. ఇందులో సగభాగం వెబ్‌సైట్‌ నిర్వాహకులకు, మిగిలిన సగం వీరికి చేరుతుంటుంది. అయితే, ఇంతకంటే తక్కువ మొత్తానికి తాము వీడియోలో అందుబాటులో ఉంటామంటూ బాధితుల నుంచి వీరు ఫోన్‌ నంబర్లు సేకరిస్తారు. నేరుగా వారికే వాట్సాప్‌, ఇతర మాధ్యమాల ద్వారా వీడియో కాల్స్‌ చేస్తారు. అవవలివారిని కూడా నగ్నంగా మాట్లాడమని సూచిస్తారు. అనంతరం అవతలి వ్యక్తి వీడియోలను రికార్డు చేస్తారు. వారి ఫోన్‌ నంబర్‌కు వీడియోలు పంపించి, అడిగిన మొత్తం చెల్లించాలని డిమాండ్‌ చేస్తారు. కాదంటే వీడియోలు బహిర్గతం చేస్తామని బెదిరిస్తారు. ఇలా ఎంతోమందిని వీరు మోసం చేశారు. ఇలా దాదాపు 300 మంది దగ్గర నుంచి రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు.

అమ్మాయిలకు జీతాలిచ్చి..

ఈ జంట తమతో పాటు మరో 30 మంది వరకు యువతులను  ఈ మోసాల్లో భాగస్వాములను చేసింది. నెలకు రూ.25వేల చొప్పున జీతాలు చెల్లించి నగ్న వీడియో కాల్స్‌ చేయించేది. కేవలం టెక్ట్స్‌ మాత్రమే చేసే వారికి రూ.15వేలు చొప్పున వీరు చెల్లించేవారని పోలీసులు తెలిపారు. ఇలా వచ్చే మొత్తంతో వీరు జల్సాలు చేసేవారు. కొత్త కొత్త నంబర్లతో ఎప్పటికప్పుడు తామున్న ప్రదేశాలను మారుస్తుండేవారు. బాధితులెవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడం వీరి వ్యాపారం బాగానే ఇన్నాళ్లూ బాగానే సాగిపోయింది.

డొంక కదిలిందిలా..

బాధితులెవరూ ముందుకు రాకపోయినప్పటికీ ఓ కేసు విచారణలో ఈ వ్యవహారం బయటకొచ్చింది. ఓ సీఏ కంపెనీ యజమాని ఫిర్యాదుతో ఈ వ్యవహారం బట్టబయలైంది. తన కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి రూ.80 లక్షలను కంపెనీ ఖాతా నుంచి బదిలీ చేసినట్లు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా వారు ఘజియాబాద్‌ పోలీసులను ఆశ్రయించడంతో తీగ లాగితే డొంక కదిలింది. మోసాలకు పాల్పడుతున్న భార్యాభర్తలు సహా, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి అరెస్ట్‌ వ్యవహారం తర్వాత చాలా మంది బాధితుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని